calender_icon.png 14 June, 2025 | 10:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుల్లో కూరుకున్న తెలంగాణ

11-06-2025 12:43:13 AM

  1. 2014లో మిగులు రాష్ట్రం 
  2. మోదీ మాడల్ పాటించనందుకే దుష్ఫలితాలు
  3. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
  4. ఏపీలోని విజయవాడలో ‘మోదీ 11 ఏళ్ల పాలన’ పుస్తకావిష్కరణ

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): తెలంగాణ సిద్ధించినప్పుడు రాష్ట్రం మిగులు రాష్ట్రమని, పాలకులు ప్రధాని మోదీ విధానాలు అమలుచేయకపోవడంతోనే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపో యిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అభిప్రాయపడ్డారు. ఏపీలోని విజయవాడ నగరంలో మంగళవారం ఆయన ఏపీ రాష్ట్ర అధ్య క్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి ‘మోదీ 11 ఏళ్ల పాలన’ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.

11 ఏళ్లలో మోదీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదని, ఇది దేశ ప్రజల నమ్మకానికి నిదర్శనమని కొనియాడారు. పేద, అణగారిన వర్గాలకు పెద్దపీట వేసేలా మోదీ పాలన సాగిందని వెల్లడించారు. రైతులు, యువత, మహిళల అభ్యున్నతి కోసం కేంద్రం అహర్నిశలు పనిచేస్తున్నదన్నారు.

 మోదీ పాలనలో భారత్ 4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారి, ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కొనియాడారు. 2014లో దేశవ్యాప్తంగా 6.91 కోట్ల మంది పన్నులు చెల్లించేవారని, ఇప్పుడా సంఖ్య 15.66 కోట్లకు చేరిందని స్పష్టం చేశారు. కేంద్ర రైతులకు ప్రాధాన్యమిస్తుందని, ఈ ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించిందని వెల్లడించారు.

11 ఏళ్లలో 82శాతం మేర గిట్టుబాటు ధరలు పెరిగాయని వివరించారు. దేశవ్యాప్తంగా 11 కోట్ల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పెట్టుబడి సాయం అందుతున్నదన్నారు. ఉగ్రవాదం విషయంలో జీరో టోలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని వివరించారు.

అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెప్పారు. 136 వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఉడాన్ స్కీం ద్వారా సామాన్యులకూ విమానయాన అవకాశాన్ని కల్పించామని వివరించారు. 2014లో దేశవ్యాప్తంగా 71 మాత్రమే విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య 159కి పెరిగిందన్నారు.