calender_icon.png 14 June, 2025 | 7:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై మొదటివారంలో ఎప్‌సెట్ కౌన్సెలింగ్

11-06-2025 12:40:17 AM

  1. ఆగస్టు 14లోపు ప్రక్రియ పూర్తి.. తరగతులు ప్రారంభం
  2. బోగస్ విద్యాసంస్థలతో విద్యార్థులు జాగ్రత్త..
  3. కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వానికి నివేదిక
  4. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి వెల్లడి

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): జూలై మొదటి వారంలో టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి ప్రకటించారు. ఏఐసీటీఈ (అఖిల భారత సాంకేతిక విద్యామండలి) మార్గదర్శకాలకు అనుగుణంగా ఆగస్టు 14లోపు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసి ఇంజినీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు తరగ తులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

మాసాబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యామండలి కార్యాల యంలో మంగళవారం ఏర్పాటు చేసి న మీడియా సమావేశంలో పలు అంశాలపై విద్యామండలి చైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి మాట్లాడారు.. ఈసారి మాక్ కౌన్సెలింగ్ సైతం నిర్వహిస్తామని చెప్పారు. ఈ విద్యాసంవ త్సరం ఎప్‌సెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యం కాలేదని స్పష్టం చేశారు. అయితే కొన్ని కాలేజీలకు ఏఐసీటీఈ నుంచి గుర్తింపు రాలేదని తెలిపారు.

రెండు, మూడు రోజుల్లో ఇంజినీరింగ్ ఫీజుల ఖరారుపై స్పష్టత వస్తుందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నారు. గుర్తింపులేని, అనధికార విద్యాసంస్థల్లో కొందరు విద్యార్థులు చేరుతున్నారని, ఆ విషయ ంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విద్యామండలి వెబ్‌సైట్‌లో ఉండే గుర్తింపు కాలేజీల వివరాలను తెలుసుకొని అడ్మిషన్లు పొందాలన్నారు.

హైదరాబాద్‌లో నాలుగు విద్యాసంస్థలను అనుమతిలేకుండా నడుపుతున్నారని చెప్పారు. నెక్ట్స్ వేవ్, బైట్ ఎక్స్‌ఎల్ టెక్ ఎడ్ ప్రైవేట్ లిమిటెడ్, లీప్‌స్టార్ట్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, ఇంటెలిపాత్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ సంస్థలకు తాము నోటీసులు జారీ చేశామని, ఈనెల 13లోపు వివరణ కోసం గడువిచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ సంస్థలు మల్లారెడ్డి, అనురాగ్, చైతన్య, అరోరా విద్యాసంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకొని అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

డీమ్డ్ వర్సిటీలతో ఒప్పందాలు చేసుకున్నట్లు ఆ విద్యాసంస్థలు తెలుపుతున్నాయన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి రూ.12 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వానికి, యూజీసీ, ఏఐసీటీఈకు లేఖలు రాస్తామని చెప్పారు. డీమ్డ్ యూనివర్సిటీలకు సంబంధించిన కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు.

గత సంవత్సరంలో 2వేల అడ్మిషన్లను ఆయా సంస్థలు చేపట్టాయని, ఈ సంవత్సరం కూడా ఆ బోగస్ సంస్థలు ఒక్కో కాలేజీతో 300 నుంచి 1200 వరకు అడ్మిషన్లు చేపట్టేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు తమకు ఫిర్యాదులందాయని, వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. 

కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వానికి నివేదిక

అలాగే బీ ఇంజినీరింగ్ సీట్ల అం శం ఇంకా స్పష్టత రాలేదని, ఈ విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికే లేఖ రాశామని ప్రొ.బాలకిష్టారెడ్డి చెప్పారు. ఇంజినీరింగ్‌లో సీట్లు చాలా ఉన్నాయని, అప్పుడే విద్యార్థుల తల్లిదండ్రులు సీట్ల కోసం తొందరపడొద్దని విజ్ఞప్తి చేశారు. సిలబస్ మార్పుపై కసరత్తు చేస్తున్నామని, 142 క్రెడిట్స్‌ను యూజీ ప్రోగ్రాముల్లో ఖరారు చేసినట్లు తెలిపారు.

ఇంజినీరింగ్‌లోని కోర్ బ్రాంచీలను ప్రోత్సహించేం దుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ఈనెలలో జేఎన్టీయూతో కలిసి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కోర్సుల ఎంపికపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ బిల్లుకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేశామని చెప్పారు.

రాష్ట్రంలోని కోచింగ్ సెంటర్లపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్ని కోచింగ్ కేంద్రాలున్నాయి.. వాటికి అనుమతులున్నాయా? వాటిపై నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక తయారు చేయనున్నట్లు  తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశాన్ని సైతం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. సమావేశంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ.పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.