calender_icon.png 4 June, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ, కిటాక్యుషు సహకార ఒప్పందంపై సంతకాలు

02-06-2025 05:46:11 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ భవిష్యత్తు కోసం కొత్తగా ప్రపంచ భాగస్వామ్యాలతో వివిధ ప్రాజెక్టులు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక(Telangana Formation Day Celebration) సందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన కిటాక్యూషు నగర మేయర్ కజుహిసా టెక్యూచి(Kitakyushu City Mayor Kazuhisa Takeuchi) నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ వంటి రంగాల్లో కిటాక్యుషు సహాకారం కోసం సీఎం రేవంత్ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. గత ఏప్రిల్ లో జపాన్ పర్యటనలో భాగంగా సీఎం కిటాక్యూషు నగరాన్ని సందర్శించిన సందర్భంగా ఆ నగర మేయర్ టెక్యూచి కజిసాతో సమావేశమైనప్పుడు పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు సంస్థలతో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కుదుర్చుకున్నారు.

తాజాగా జరిగిన భేటీలో రేవంత రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కిటాక్యూషు ప్రతినిధి బృందానికి స్వాగతం తెలిపారు. జపాన్ పర్యటన సందర్భంగా కిటాక్యూషు నగర ఎకో-టౌన్ మాడల్ తో చాలా ప్రేరణ పొందినట్లు వెల్లడించారు. మీరిచ్చిన ప్రేరణతోనే తెలంగాణ ప్రభుత్వం అలాంటి నమూనాను హైదరాబాద్ లో అభివృద్ధి చేయడం కోసం అనేక సంస్థలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేసినట్లు వ్యాఖ్యానించారు. సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సున్నా ఉద్గారాలు, పట్టణ ఆవిష్కరణలలో ఈ సహకారం పునాది కానుందని, మూసీ నది అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుపైన ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. తెలంగాణ యువతకు నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని వివరించారు. 

జపాన్ లో అవకాశాలను అన్వేషించాలన్న అభిలాషతో ఇక్కడి విద్యార్థులు జపనీస్ భాషను నేర్చుకోవాలని అనుకుంటున్నారు. మీ సహకారంతో ఔత్సాహికులకు జపనీస్ నేర్పించాలని భావిస్తున్నట్లు ఆయన అభిప్రాయాపడ్డారు. హైదరాబాద్ నుంచి నేరుగా కిటాక్యూషు మధ్య విమాన కనెక్టివిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కిటాక్యుషు నగర  నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. కిటాక్యూషు నగర అభివృద్ధి తెలంగాణ రైజింగ్ కు సరిపోయేలా ఉందని, రెండింటి మధ్య స్నేహం సుదీర్ఘ కాలం కొనసాగాలని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.