09-12-2025 02:13:32 AM
భవిష్యత్ కోసం రోడ్ మ్యాప్
హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి) : కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. 2047కు సరి కొత్త లక్ష్యాలు నిర్దేశించుకొని ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 2047 నాటికి తెలంగాణ ౩ ట్రిలియన్ డాలర్ల ఎకానమిగా ఎదగాలనేదే తమ లక్ష్యమని తెలిపారు. ఫ్యూ చర్ సిటీలో సోమవారం ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ముఖ్య మంత్రి ప్రసంగించారు.
2047 నాటికి భారతదేశ జీడీపీలో 10 శాతం వాటాను తెలం గాణ నుంచి అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో అపారమైన అవకాశాలు ఉన్నా యని, మంచి సానుకూల వాతావరణం ఉందన్నారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని తెలిపారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9 శాతం జనాభా కలి గి ఉందని, దేశ జీడీపీలో తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నామని పేర్కొన్నారు.
దేశ స్వాతంత్య్రం అనంతరం మన నాయకులు కొత్త రాజ్యాంగాన్ని రూపొందించి భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ వేశారని, తాము కూడా తెలంగాణ భవిష్యత్తు కోసం రోడ్ మ్యాప్ రూపొందిం చాలనుకున్నామని వెల్లడించారు. ఇందుకు మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాతల నుంచి ఎంతో స్ఫూర్తిని పొందామని తెలిపారు. తెలంగాణ ప్రజలు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని, 2014లో సోనియా గాంధీ, ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కల సాకార మైందని గుర్తు చేశారు.
భారతదేశంలో యువ రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని, వచ్చే పదేళ్లలో తెలంగాణను దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చైనాలోని గ్వాంగ్ -డాంగ్ ప్రావిన్స్ సాధించిన అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించారు. గ్వాంగ్ డాంగ్ ఆర్థిక వ్యవస్థ చైనాలోని ప్రావిన్స్లలోనే అతిపెద్దదని, 20 సంవత్సరాల్లో వారు ప్రపం చంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధి రేటును సాధించారని తెలిపారు. తెలంగాణలో కూడా మేము అదే నమూనాను అనుసరించాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు.
అందరికీ ధన్యవాదాలు..
దేశానికి స్వాతంత్రం సిద్ధించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి మనమేం సాధించగమో చెప్పాలని నిపుణులను కోరానని, ఆ సమయంలోనే తెలం గాణ రైజింగ్- దార్శనికతకు బీజం పడిందన్నారు. మనమేదైనా గొప్పగా చేయాలని భావించినప్పుడు తెలంగాణ సంస్కృ తిలో ముందుగా దేవుళ్ల ఆశీర్వాదం తీసుకుంటామని, ప్రజల మద్దతు కోరుతామని తెలిపారు.
భవిష్యత్తు కోసం మన కలలను నెరవేర్చుకోవడానికి ప్రజల ఆలోచనలు, అంచనాలు తెలుసుకున్నామని, అధికారులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, నీతి ఆయోగ్ నిపుణుల సహాయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ విజన్ రూపొందించడంలో సహయపడిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ గ్లోబల్ సమ్మిట్కు అన్ని రంగాలకు చెందిన ప్రతినిధులు ఇక్కడకు రావడం మన అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు.
వ్యాపార వేత్తలు, కార్పొరేట్ దిగ్గజాలు, విధాన నిర్ణేతలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు, నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమ్మిట్లో మీ సూచనలు, సలహాలు, అభిప్రాయాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం.. ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించామని, మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం అని స్పష్టం చేశారు.
ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్దేశించామని, కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ స్పష్టం చేశారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందామని, ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని వెల్లడించారు. ఈ తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షించారు.
ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చు, కానీ ఆ విజన్ను సాధించగలమని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ టీమ్కు తాను చెప్పేదొక్కటే అని, కష్టంగా ఉంటే వెంటనే చేపడుదామని, అసాధ్యం అనుకుంటే.. వారికి కొంత గడువు ఇస్తానని తెలిపారు. ఇవాళ నేను నిన్నటి కంటే ఎక్కువ విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నానని, నిన్నటిది ఒక కల, ఒక ప్రణాళిక అన్నారు.
ప్రస్తుతం మీరందరూ మాతో చేరారని, ఈ ప్రయాణంలో భాగస్వాములుగా ఉండాలని ఆశిస్తున్నామని తెలిపారు. మీ అందరి మద్దతుతో తెలంగాణ రైజింగ్ లక్ష్యాలన్నింటినీ సాధించగలమని బలంగా నమ్ముతున్నామని స్పష్టం చేశారు. చివరగా.. తెలంగాణ రైజింగ్ నిరంతర ప్రక్రియ అందరూ ఇందులో భాగస్వామలు కావాలని పిలుపునిచ్చారు.