23-07-2025 07:34:40 PM
సంబరాలు నిర్వహించిన ఇల్లందు ఆర్టీసీ డిపో
ఇల్లందు, (విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC ) మరో మైలురాయి దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్ లో బుధవారం నాటికి ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 200 కోట్ల మంది మహిళలు జీరో టికెట్లు ఉచిత ప్రయాణం మైలురాయిని దాటగా ఇల్లందు డిపో నందు ఆర్టీసీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన నాటినుండి 18 నెలల కాలంలో 200 జీరో టికెట్లు మైలు రాయిని దాటుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని ప్రధానంగా మహిళలకు ఉచిత బస్సు, మహిళా స్వయం శక్తి రుణాలు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతు భరోసా, సన్నాలకు బోనస్, రేషన్ షాపుల ద్వారా ఉచిత సన్నబియ్యం, ఇందిరమ్మ ఇల్లు మొదలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులను అందించారు. అదేవిధంగా ఖమ్మం నుంచి ఇల్లందుకు రాత్రి 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో రెండు సర్వీసులను పెంచాలని ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్, ఎస్సై శ్రీనివాస్ రెడ్డి, ఆర్టీసీ ట్రాఫిక్ ఇంచార్జి సునీత, గ్యారేజ్ ఇన్చార్జి ఎన్వి నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు మడుగు సాంబమూర్తి మండల రాము, బోళ్ల సూర్యం, చిల్లా శ్రీనివాస్, సతీష్, కొక్కు నాగేశ్వరరావు, జాఫర్, ఇందిరా మహిళా స్వయం శక్తి మహిళలు, ప్రయాణికులు పాల్గొన్నారు.