calender_icon.png 4 June, 2025 | 10:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోరాటాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం

02-06-2025 05:04:38 PM

తొలి పదేండ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచింది..

మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు..

మంచిర్యాల (విజయక్రాంతి): పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాకారమైందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు(Former MLA Nadipelli Diwakar Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలలో భాగంగా సోమవారం నస్పూర్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్యతో కలిసి మాట్లాడారు. 14 ఏళ్ల అలుపెరుగని పోరాటంతో, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అమరుల త్యాగాలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల పోరాటాలు, సబ్బండ వర్గాల సమిష్టి కృషితోనే ఆరు దశాబ్దాల కల సహకారం అయిందన్నారు.

తొలి పదేండ్లలో దేశానికి ఆదర్శంగా నిలిచింది

 కొట్లాడి సాధించుకున్న తెలంగాణ తొలి పదేళ్ల ప్రస్థానం యావత్ భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ హయాంలో చేసిన ప్రతి ఆలోచన అనేక రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా దిక్సూచిగా నిలిచిందని అన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 66 హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమకారుల కుటుంబ సభ్యులకు నెలకు రూ.25 వేల పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని,  ప్రతి ఆటో డ్రైవర్ కు సంవత్సరానికి 12 వేల ఆర్థిక సాయం, నిరుపేద హిందూ, మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే లక్ష రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 10 గ్రాముల బంగారం, 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతీకి ఎలక్ట్రిక్ స్కూటర్లు, దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచడం తదితరాలను వెంటనే అమలు చేయాలని కోరారు. 

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి - మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఇప్పటికైనా అమలు చేయాలని బెల్లంపల్లి మాజీ ఎంఎల్ఏ దుర్గం చిన్నయ్య అన్నారు. మహిళలకు ప్రతినెల రూ. 2500, రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ. 15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు, గృహ జ్యోతి కింద ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 2500 చ.గ. ఇంటి స్థలం., యువ వికాసం కింద విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు, చేయూత కింద రూ. 4 వేల పింఛన్లు (పెన్షన్) తదితర ఇలా ఎన్నో హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పటికైనా ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాజా రమేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.