18 June, 2026 | 2:44 AM

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ‘టెలిగ్రామ్’

18-06-2026 01:20 AM

కేంద్ర ప్రభుత్వ నిషేధ నిర్ణయంపై అభ్యంతరం

అత్యవసర విచారణకు కోర్టు అంగీకారం

న్యూఢిల్లీ, జూన్ 17: నీట్-యూజీ జూన్ 21న జరగనున్న పునఃపరీక్షకు ముందు జూన్ 22 వరకు దేశవ్యాప్తంగా తమ సేవలను తాత్కాలికంగా నిషేధించాలన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ టెలిగ్రామ్ బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం తీసుకున్న చర్యను విమర్శిస్తూ, ఇది సమస్యకు పరిష్కారం కాదని, కోట్లాదిమంది వినియోగదారులను ప్రభావితం చేస్తుందని పిటిషన్‌లో పేర్కొంది.

పరీక్ష పేపర్‌ను లీక్ చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలే గానీ టెలిగ్రామ్‌ను నిషేధించడం తగదని ఆవేదన వ్యక్తం చేసింది. చాలామంది తమ డిజిటల్ ఆనవాళ్లను దాచేందుకు వీపీఎన్‌ని ఉపయోగిస్తున్నారని, అటువంటి వారిని దర్యాప్తు చేయడం కష్టమని తెలిపింది. ఈ విషయాన్ని జస్టిస్ తేజస్ కారియా నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ముందు ప్రస్తావించగా, ఆయన దీనిని అత్యవసర ప్రాతిపదికన విచారించడానికి అంగీకరించారు. ఈ కేసు త్వరలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశంతో 99 శాతానికిపైగా మొబైల్స్‌లో టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా తొలగించాయి.