భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు
హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని ఆలయాలు గురువారం భక్తులతో కిటకిటలాడాయి. కొత్త వస్త్రాలు ధరించి, భక్తులు తమ నివాసాలకు సమీపంలోని ఆలయాలకు పోటెత్తి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అత్యధికంగా జంట నగరాల్లోని శ్రీ గణేశ ఆలయాలను సందర్శించి రాబోయే సంవత్సరం సుసంపన్నంగా, వైభవంగా సాగాలని పూజలు చేశారు.
సుభాష్ బజార్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం, జూబ్లీ హిల్స్లోని శ్రీ పెద్దమ్మ ఆలయం, బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, లిబర్టీ, జూబ్లీ హిల్స్లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలే కాకుండా సికింద్రాబాద్లోని జేబీఆస్ మెట్రో స్టేషన్ వద్ద శ్రీ సిద్ధి వినాయక గణేష్ ఆలయం, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గణేష్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, భక్తులు తమ నివాసాలలో ‘పూరణ్ పోలి’ అని కూడా పిలువబడే ‘బొబ్బట్లు’ను, అలాగే బెల్లం, చింతపండు, వేప చిగుళ్లు, పచ్చి మామిడికాయలతో ‘ఉగాది పచ్చడి’ని తయారుచేశారు. నగరంలోని ఆలయాలే కాకుండా తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.




