calender_icon.png 21 February, 2026 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ ఏఐ సమ్మిట్‌లో ఉద్రిక్తత

21-02-2026 02:04:02 AM

చొక్కాలు విప్పి యూత్ కాంగ్రెస్ కార్యకర్తల నిరసన

ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు

నిరసనకారులను అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: ఢిల్లీలోని భారత్ మండపంలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కలకలం సృష్టించారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’ జరుగుతున్న సమయంలో, కొందరు కార్యకర్తలు హఠాత్తుగా చొక్కాలు విప్పి ప్రధాని మోదీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సదస్సులో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, భారత్ వాణిజ్య ఒప్పందం వంటి అంశాలను ప్రస్తావిస్తూ కార్యకర్తలు నిరసనకు దిగారు. ’పీఎం ఈజ్ కాంప్రమైజ్డ్’ అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ, సమ్మిట్ బోర్డు ముందు నిలబడి గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి, ఆందోళనకారులను బలవంతంగా బయటకు పంపించి, అదుపులోకి తీసుకున్నారు. వారిని తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ ఉన్నతస్థాయి సదస్సులో భద్రతను దాటుకుని కార్యకర్తలు ఎలా లోపలికి వచ్చారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించిన వీడియోలను యూత్ కాంగ్రెస్ తమ ’ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రభుత్వం జాతీయ ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తులకే ప్రాధాన్యత ఇస్తోందని యూత్ కాంగ్రెస్ ఒక ప్రకటనలో ఆరోపించింది. ఈ ఘటన తర్వాత భారత్ మండపం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.