21-06-2025 01:08:41 AM
విషయం తెలియక వివిధ ప్రాంతాల నుంచి అభ్యర్థుల రాక
వర్సిటీ ఎదుట కుటుంబీకులతో కలిసి ధర్నా
రాజేంద్రనగర్, జూన్ 20: అగ్రికల్చర్ వర్సిటీలో అసిస్టెంట్ వార్డెన్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఇంటర్వ్యూలను ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వాయిదా వేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 20 అసిస్టెంట్ వార్డెన్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేయగా వివిధ జిల్లాలకు చెందిన అభ్యర్థులు నమోదు చేసున్నారు.
శుక్రవారం రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయంలో ఇంటర్వ్యూలకు వివిధ జిల్లాల నుంచి చాలామంది మహిళలు తమ పిల్లలతో కలిసి తరలివచ్చారు. అయితే అధికారులు అభ్యర్థులకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలు వాయిదా వేసినట్లు బోర్డు ఏర్పాటు చేయడంతో పరిపాలన భవనం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి నినాదాలు చేశారు.
రిజిస్ట్రార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు భారీగా అక్కడికి చేరుకున్నారు. ఇంటర్వ్యూ లు ఉన్నాయని చెప్పడంతో గురు వారం రాత్రి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చామని పలువురు అభ్యర్థులు వాపోయారు. సమాచారం ఇవ్వకుండా ఇంటర్వ్యూలు వాయిదా వేయడం ఏంటని మండిపడ్డారు. యూనివర్సిటీ అధికారుల తీరు చూస్తుంటే అసిస్టెంట్ వార్డెన్ పోస్టులను అమ్ముకున్నట్లు అనిపిస్తుందని అభ్యర్థు లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతరం విద్యార్థి సంఘ నేత కాటం శ్రీధర్ మాట్లాడుతూ.. అధికారుల తీరు వివాదాస్పదంగా ఉందన్నారు. పోస్టులను రోస్టర్ విధానంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్ అభ్యర్థులకు సర్దిచెప్పినా వినలేదు. రిజిస్ట్రార్ స్పష్టమైన హమీ ఇవ్వాలని కోరారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్త కుండా మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామని, ఎవ్వ రూ కూడా ఆందోళన చెందాల్సి అవసరం లేదని రిజిస్ట్రార్ హామీ ఇవ్వడంతో అభ్యర్థులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.