భారత్, పాక్ మ్యాచ్కు ఉగ్రముప్పు!
ఖండించిన అమెరికా
న్యూయార్క్: టీ20 ప్రపంచకప్లో చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్థాన్ మధ్య జూన్ 9న జరగనున్న మ్యాచ్కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు గురువారం వార్తలు రాగా.. ఐసీసీతో పాటు అమెరికా వాటిని ఖండించాయి. ఆ వార్తలు నిజం కాదని న్యూయార్క్ గవర్నింగ్ బాడీ తెలిపింది. భద్రతా విషయంలో మూడెంచెల పటిష్ట బందోబస్తూ ఏర్పాటు చేశామని.. అనుమతి లేకుండా ఎవరిని స్టేడియంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. ఆధునిక టెక్నాలజీ సాయంతో మ్యాచ్ జరగనున్న నాసౌ కౌంటీ స్టేడియం వెలుపల ప్రతీ మూలన నిఘా కెమెరాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. న్యూయార్క్ గవర్నర్ కాతీ హోచుల్ మాట్లాడుతూ.. ‘ఉగ్రముప్పు వార్తల్లో నిజం లేదు. ప్రజా భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. న్యూయార్క్ వేదికగా జూన్ 3 నుంచి 12 వరకు తొమ్మిది మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే న్యూయార్క్ స్టేట్ పోలీస్కు పూర్తి బాధ్యతలు అప్పగించాం. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు.






