02-06-2025 11:10:31 PM
ఎఫ్డీసీ చైర్మన్ అధికారాన్ని దిల్ రాజు దుర్వినియోగం చేశారని, గద్దర్ అవార్డ్స్(Gaddar Awards)లో తెలంగాణ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగిందని టీఎఫ్ సీసీ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్(TFCC Chairman Prathani Ramakrishna Goud) ఆరోపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్స్ సమస్యకు ఇండస్ట్రీలోని ఆ నలుగురే కారణమని, వాళ్లే తమ స్వార్థంతో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు.
ఈ సందర్భంగా రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ.. “నేను 1992 నుంచి నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్గా కొనసాగుతున్నా. 2002 వరకు థియేటర్లలో పర్సంటేజీ విధానం ఉండేది. ఆ తర్వాత సురేశ్బాబు లాంటి కొందరు తమ స్వార్థంతో థియేటర్లలో అద్దె పద్ధతిని మొదలుపెట్టారు. అల్లు అరవింద్, దిల్ రాజు, ఏషియన్ సునీల్ లాంటి వాళ్లు సురేశ్బాబు బాటలోనే నడిచి మొత్తం థియేటర్లను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నారు. మొత్తం 1500 థియేటర్లలో 300 థియేటర్లు మాత్రమే యజమానులు నిర్వహిస్తున్నారు. మిగతా 1200 థియేటర్లను వీళ్లే లీజ్కు తీసుకుని రెంట్ విధానంలో నిర్వహిస్తున్నారు. మరికొన్నింటికి మెయింటనెన్స్ ఛార్జీ ఇచ్చి తీసుకున్నారు.
దీంతో ఒకప్పుడు తెలంగాణలో 150 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉంటే ఇప్పుడు వేళ్లమీద లెక్కపెట్టేంత మందే మిగిలారు. ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. పర్సంటేజీ సిస్టమ్ పెట్టాలని మేము నిరాహార దీక్ష చేశాం. థియేటర్లకు కంటెంట్ ఇచ్చే డిజిటల్ ప్రొవైడర్స్ రెంట్ అధికంగా ఉంటోంది. 50 థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తే రూ.5 లక్షలు కట్టాల్సి వస్తోంది. దీనికి తోడు ట్యాక్స్ ఉండనే ఉంటోంది. పర్సంటేజీ వల్ల ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్లంతా బాగుపడ్డారు. ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి. తినుబండారాల ధరలు అధికంగా ఉంటున్నందున సామాన్యులు థియేటర్లకు వెళ్లలేకపోతున్నారు. ఏపీలో థియేటర్స్ వ్యవస్థ ప్రక్షాళనకు పవన్కల్యాణ్ తీసుకుంటున్న చర్యలను అభినందనీయం. ఆయనకు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి పూర్తి సహకారం ఉంటుంది” అన్నారు.
జ్యూరీ చైర్మన్లుగా వాళ్లను పెట్టడమేంటి?
“తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల వ్యవస్థ బాగు కోసం సినిమాటోగ్రఫీ మంత్రి ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలి. అలాగే గద్దర్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం అవార్డ్స్ ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ అవార్డ్స్ జ్యూరీకి మురళీమోహన్, జయసుధను ఛైర్మన్లుగా పెట్టడం ఏంటో అర్థం కాలేదు. తెలంగాణ అవార్డ్స్లో ఇక్కడివారికి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దిల్ రాజు ఎఫ్డీసీ ఛైర్మన్గా తన అధికారాలను దుర్వినియోగం చేశారు. తన వాళ్లకే అవార్డ్స్ ఇచ్చుకున్నారు. కమిటీలో ఉన్నవాళ్ల సినిమాలకు అవార్డ్స్ ఇవ్వకూడదనే నిబంధనలు కూడా పాటించలేదు. థియేటర్స్ బంద్ ఇష్యూలోనూ దిల్ రాజు ప్రమేయం ఉంది” అన్నారు.
ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి
టీఎఫ్సీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హీరో కిరణ్ మాట్లాడుతూ.. “నేను తెలుగులో 20 చిత్రాల్లో నటించా, తమిళంలో రెండు సినిమాలు చేశా. ఆ రెండు చిత్రాలకే నాకు ఒక అవార్డ్ వచ్చింది. తెలుగులో చేసిన సినిమాలకు ప్రైవేట్ సంస్థల అవార్డ్స్ వచ్చాయి కానీ ప్రభుత్వం ఇచ్చిన అవార్డ్స్లో మమ్మల్ని మర్చిపోయారు. ఈ అవార్డ్స్ విషయంలో ప్రభుత్వం పునఃసమీక్ష చేసుకోవాలి” అన్నారు.
రాష్ట్రాలు విడిపోయినా టీఎఫ్సీసీని గుర్తించరేం?
తెలంగాణ డైరెక్టర్స్ యూనియన్ ప్రెసిడెంట్ రమేశ్ నాయుడు మాట్లాడుతూ.. “వినోద పరిశ్రమలో కొందరు రాజకీయాలు చేస్తున్నారు. గద్దర్ అవార్డ్స్లో తెలంగాణ నటీనటులు, సాంకేతిక నిపుణులకు అన్యాయం జరిగింది. ప్రతిభ ఉంటే ఏపీ వారికి కూడా అవార్డ్స్ ఇవ్వండి.. కానీ స్థానికులైన తెలంగాణ నటీనటులను, సాంకేతిక నిపుణులను విస్మరించారు. రాష్ట్రాలు విడిపోయాక కూడా టీఎఫ్సీసీని అధికారికంగా గుర్తించడం లేదు. ప్రభుత్వం సినిమా పరిశ్రమలో జరుగుతున్న ఇలాంటి వాటిపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలి” అన్నారు.
అవార్డు ప్రదానోత్సవాన్ని అడ్డుకుంటాం
తెలంగాణ రైటర్స్ యూనియన్ ప్రెసిడెంట్ అమృత్గౌడ్ మాట్లాడుతూ.. ‘దిల్ రాజు.. గద్దర్ అవార్డ్స్ విషయంలో తన సొంత అవార్డ్స్లా వ్యవహరించారు. తన ఇంటి సినిమాలకు, కమిటీ మెంబర్స్ సినిమాలకు అవార్డ్స్ ఇచ్చారు. ఆయన తన తప్పును సవరించుకుని మరోసారి అవార్డ్స్ ప్రకటించాలి. తెలంగాణ స్థానిక కళాకారులకు ప్రాధాన్యమివ్వాలి. ప్రజాధనంతో అందిస్తున్న గద్దర్ అవార్డ్స్ను దుర్వినియోగం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ బుద్ధి జీవులు, మేధావులు, ఇక్కడి సినీరంగ ప్రముఖులతో కమిటీ వేసి అవార్డులు ఇవ్వాలి. ఇప్పటికే ఈ అవార్డులపై తెలంగాణలోని అన్నిరంగాల వారు మండిపడుతున్నారు. అందరూ పోరాట సన్నాహాల్లో ఉన్నారు. ఉద్యమం ఉధృతం కాకముందే ప్రభుత్వం మేలుకోవాలి. లేకపోతే అవార్డు ప్రదానోత్సవాన్ని అడ్డుకుంటాం” అన్నారు.