29-05-2025 02:57:39 AM
- సీపీఎం రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా
- బిల్లుల కోసం ఈ నెల 30 కలెక్టరేట్ ముట్టడిని జయపద్రం చేయండి:సీఐటీయూ నాయకులు
అబ్దుల్లాపూర్మెట్, మే 28: జాతీయ ఉపాధి హామీ పథకాన్నికేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని సీపీఎం రంగారెడ్డి జిల్లా నాయకులు ఏర్పుల నర్సింహా అన్నారు.
బుధవారం స్థానిక నాయకులతో కలిసి మండల పరిధిలో గండిచెరువు, అనాజ్ పూర్ గ్రామాలలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల దగ్గర వెళ్లి.. వారికి అందాల్సిన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకు న్నారు. అనంతరం ఏర్పుల నర్సింహా మాట్లాడుతూ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాలన్నారు.
ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. గత రెండు నెలల నుంచి ఉపాధి హామీ బిల్లులు రావడం లేదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఉపాధి పథకానికి తూట్లు పొడుస్తుందని..కూలీలకు కల్పించాల్సిన సౌకర్యా లు గడ్డపారలు, పారలు, అలాగే మేటిలకు మెడికల్ కిట్స్, టెంట్, మూడు కిలో మీటర్లు దూరముంటే వెళ్లి.. రావడానికి ఆటో చార్జీలు లాంటి సౌకర్యాలు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చారని మోడీ సర్కార్ వచ్చిక వీటన్నిటికీ కోత పెట్టిందని దుయ్యబట్టారు. అలాగే ఫీల్డ్? అసిసెంట్లకు జీతాలు రాక నాలుగు నెలలు కావొస్తుందన్నారు.
కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించకపోతే.. విరక్తి చెంది పనులు మానేసే విధంగా కేంద్ర సర్కార్ కుట్ర పన్నుతుందన్నారు. కూలీలకు సౌకర్యాలన్ని కల్పించి.. పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి అదనంగా నిధులు కేటాయించి, వందరోజుల పనిని.. కాస్త 200 రోజులకు పెంచి.. కొలత పద్దతిని తొలగించి.. కూలీకి రూ. 600లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని.. కూలీ రేట్లు, పని రోజులు పెంచాలని ఈ నెల 30న కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు ఉపాధి కూలీలందరూ అధిక సంఖ్య లో హాజరై.. విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం ముత్యాలు, కూలీలు అనూష సుజాత ఇందిర, పోచమ్మ రాజమణి అనిత, చంద్రకళ తదితరులున్నారు.