09-05-2025 02:19:22 AM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ, మే 18 (విజయక్రాంతి) : మతం ముసుగులో ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచిన పాకిస్తాన్ ఉగ్రమూకలకు భారత సైన్యం సరైన రీతిలో ఆపరేషన్ సింధూర్ పేరుతో సరైన జవాబు చెప్పిందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ ,సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం అయన నల్గొండ జిల్లా నకిరేకల్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ నుండి ఎంపీడీవో కార్యాలయం వరకు భారత సైన్యానికి మద్దతుగా నిర్వహించిన సంఘీభావ ర్యాలీని జండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ భారత సైన్యానికి మద్దతుగా నకిరేకల్లో ర్యాలీ నిర్వహించడం సంతోషకరమన్నారు. పహల్గాం దాడి అమానుషమని, మతాన్ని అడ్డం పెట్టుకుని ఉగ్రవాదులు మన ఆడబిడ్డల సింధూరాన్ని తుడిచివేశారని, అలాంటి పాకిస్తాన్ మూకలకు గత వారం రోజుల్లో ఆలోచించి ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు జరిపి కాశ్మీర్ దాడిలో పాల్గొన్న ఉగ్రమూకలందరికి బుద్ధి చెప్పారన్నారు.
తెలంగాణ రాష్ట్ర పక్షాన భారత సైన్యానికి మద్దతుగా ఉన్నామని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. అన్ని సెక్టర్ల సైన్యానికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని ,రాబోయే రోజుల్లో తెలంగాణ అన్ని రకాల సహాయ సహకారాలను సైన్యానికి అందిస్తుందని,అలాగే కేంద్రానికి ఈ విషయంలో తోడుగా నిలుస్తుందని తెలిపారు.
భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి ,ఇంచార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.