03-12-2025 07:02:29 PM
* లెక్క తేలింది ఇక పోరుకు సై..
* పలు పంచాయితీలో ద్విముఖం, త్రిముఖం, బహుముఖం పోటీ
* 6 పంచాయతీలు ఏకగ్రీవం
* రాజుకున్న ఎన్నికల వేడి
* ఊపందుకోనున్న ప్రచారం
పాపన్నపేట (విజయక్రాంతి): పల్లె సంగ్రామం సందర్భంగా మొదటి విడతలో నిర్వహించనున్న ఎన్నికల ప్రక్రియ చివరి అంకానికి చేరుకుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారం ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో మిగిలిన వారెవరో లెక్క తేలింది. మండలంలోని 40 గ్రామ పంచాయితీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆయా గ్రామ పంచాయితీలో అభ్యర్థులు తమ భవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాతో పాటు వారికి గుర్తులు కేటాయిస్తూ ఎన్నికల అధికారులు వివరాలు వెల్లడించారు. ఇక నుంచి ప్రచారం ఊపందుకోనుంది. ఎన్నికల ప్రచారంతో పల్లెల్లో రాజకీయ వేడి రాజుకొనుంది. జనరల్ స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. సర్పంచి పదవిని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. ఎన్నికలకు ఇంకా వారం రోజుల సమయమే ఉంది. ఫలితాలు ఎలా ఉంటాయోనని ఓటర్లు కూడా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రాజకీయ పార్టీ నేతల ఉపసంహరణ చేయడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని పంచాయితీల్లో విఫలమయ్యాయి.
40 గ్రామ పంచాయతీలకు 6 జీపీలు ఏకగ్రీవం
మండలంలో 40 గ్రామపంచాయతీలు ఉండగా అందులో 6 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. నామాపూర్, మల్లంపేట, కందిపల్లి, అమ్రియా తాండ, యూసుఫ్ పేట, లక్ష్మీ నగర్ గ్రామాల్లో సర్పంచి, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ద్విముఖం, త్రిముఖ, చతుర్ముఖ పోటీ
పలు పంచాయతీల్లో ద్విముఖం, త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. మెజారిటీ గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల మద్యే పోటీ నెలకొంది. పాపన్నపేటలో కాంగ్రెస్ నుంచి ప్రధానంగా ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీలో ఇదే తంతు నెలకొంది. పార్టీ రహితంగా గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ నేతల ప్రమేయం కాదనలేనిధి. ఇదిలా ఉంటే ఒకే పార్టీ నుంచి పలువురు పోటీ పడుతుండటంతో ఎవరు గెలిచినా "మన గూటి పక్షులే కదా".. అన్న భావన కూడా ముఖ్య నేతల్లో నెలకొంది.
దావత్ లు షురూ..
మండలంలోని ఆయా గ్రామపంచాయతీల్లో తడి పొడి దావతులు ప్రారంభమయ్యాయి. నిశి రాత్రిలో 'నిషా'ను తలకెక్కిస్తున్నారు. తమకు ఓటు వేయాలని వేడుకుంటున్నారు. ఐదు నుంచి పది ఓట్లు ఉన్న వారి కుటుంబాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. పల్లె పోరు కావడంతో బలగం.. బలం.. కులాలపై ఎన్నికలు సాగుతున్నాయి. రిజర్వేషన్ల లోని మెజారిటీ స్థానాలు తక్కువ ఖర్చుతోనే బయటపడే వీలుండగా జనరల్ స్థానాల్లోనే డబ్బుల పంపిణీకి తెరతీసే అవకాశం నెలకొంది. ఏది ఏమైనప్పటికీ మంచిని గెలిపించి.. పల్లెకు పండుగ చేద్దామని గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు కంకణబద్ధులై ఉన్నారు. మరో వారం రోజులు వేచి చూడాల్సిందే.. ఎవరికీ పట్టం కట్టబెడతారోనని.