06-06-2025 12:59:36 AM
సంగారెడ్డి, జూన్ 5(విజయక్రాంతి):: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం చౌక దుకాణాల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అందజేస్తోంది. అయితే వీటిని తీసుకోవడానికి చాలా మంది కార్డుదారులు నెలల తరబడి ముందుకు రావడం లేదు. దీంతో వారికి విడుదల చేసిన కోటా బియ్యం డీలర్ల వద్ద మిగిలిపోతుంది.
ఇలాంటి వాటిని అనుమానాస్పద కార్డులుగా గుర్తించిన ప్రభుత్వం వారి వివరాలతో కూడిన జాబితాను జిల్లాకు పంపించింది. దీంతో మండలాల వారీగా వివరాలు సిద్ధం చేసిన జిల్లా పౌరసరఫరాల అధికారులు కార్డుల వివరాలను తహసీల్దార్లకు అందజేశారు. దీంతో అసలు వారు అర్హులా.. కాదా తేల్చే దిశగా రెవెన్యూశాఖ ఫోకస్ పెంచింది. క్షేత్ర స్థాయి విచారణ అనంతరం అర్హులు కాకుంటే ఆ కార్డుల తొలగింపునకు సిద్ధమవుతుంది.
జిల్లాలో 6,700 కార్డులు గుర్తింపు..
సంగారెడ్డి జిల్లాలో 6,700 రేషన్ కార్డుదారులు ఆరు నెలలుగా బియ్యం తీసుకోనట్లుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ కార్డులకు సంబంధించి 14,000 మంది లబ్దిదారులున్నారు. వీరికి ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం కోటా విడుదల చేస్తున్నా తీసుకోవడం లేదు. దీంతో అసలు కార్డుదారులు బతికే ఉన్నారా..
లేక శాశ్వతం గా వలస వెళ్లారా... వందేళ్లు పైబడిన, 18 ఏళ్లలోపు పిల్లల పేరిట కార్డులేమైనా ఉన్నాయా అనే దానిపై ఆరా తీశారు. ఈమేరకు తహసీల్దార్లు క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టారు. పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాత జిల్లా వ్యాప్తంగా 6,700 కార్డుదారులను అనర్హులుగా గుర్తించారు.
సన్నబియ్యం పంపిణీ నుంచి ఇదీ పరిస్థితి..
రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. ఓ వైపు కార్డుదారులు బియ్యం కోసం దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. మరోవైపు రెండు నెలల్లో జిల్లాలో వేలాదిగా కార్డుదారులు బియ్యం తీసుకునేందుకు ముందుకు రావడం లేదు.
ఇక కొత్త కార్డు కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతుంటే కార్డులున్న వారు బియ్యం పొందేందుకు ముందుకు రాకపోవడమేంటనే సందేహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా కార్డులు పొందడం జరిగింది. క్షేత్రస్థాయి విచారణ అనంతరం ఇందులో 6,700 కార్డుదారులు అనర్హులుగా నిర్ధారించారు.
అనర్హులను గుర్తించాం...
ప్రభుత్వం నుంచి అందిన అనుమానస్పద కార్డుల వివరాలను మండలాల వారీగా సిద్ధం చేసి తహసీల్దార్లకు అందజేశాం. వారు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అనర్హులను గుర్తించారు. జిల్లాలో 6,700 కార్డుదారులను అనర్హులుగా గుర్తించాం. అలాగే సన్నబియ్యం తీసుకునేందుకు ముందుకు రాని వారిపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాం. అనర్హులు రేషన్ కార్డులను పొంది ఉంటే వాటిని స్వచ్చందంగా అధికారులకు అప్పగించాలి.
- - వనజాత, డీఎస్వో, సంగారెడ్డి