11-06-2025 11:10:33 PM
బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యమే లక్ష్యం..
‘మాస్’ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగ్రావు..
‘మన ఆలోచన సాధన సమితి’ రాష్ట్ర కమిటీ ప్రకటన..
ఎల్బీనగర్: బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యమే లక్ష్యంగా ‘మన ఆలోచన సాధన సమితి(మాస్)’ ను తెలంగాణ వ్యాప్తంగా గ్రామ గ్రామాన విస్తరింపజేస్తామని ‘మాస్’ వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగ్రావు(State President Katakam Narisng Rao) పేర్కొన్నారు. బుధవారం నాగోల్లోని ‘మన ఆలోచన సాధన సమితి’ ప్రధాన కార్యాలయంలో సంస్థ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన ఆలోచన సాధన సమితి(మాస్) ఆధ్వర్యంలో గత ఏడాది కాలంగా బీసీ కులాల్లో చైతన్యం తీసుకురావడానికి తెలంగాణలో ఉన్న మేధావులు, విద్యావేత్తలు, ఉద్యోగస్తులతో, బీసీ ఉద్యమకారులతో, వివిధ కుల సంఘాల నాయకులతో అనేక చర్చలు, సమావేశాలు నిర్వహించామన్నారు. అనంతరం అందరి సూచనలు, సలహాల మేరకు ‘మన ఆలోచన సాధన సమితి’ సంస్థను ఏప్రిల్ 15 న ఆవిర్భావం చేసుకున్నామన్నారు.
జూన్ 15 నుంచి గ్రామ బాట..
మన ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో త్వరలో బీసీ కులవృత్తుల నాయకుల సమావేశం ఏర్పాటు చేసి గ్రామ బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 15న రాష్ట్రంలోని 108 ప్రాంతాల్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘మన ఆలోచన సాధన సమితి (మాస్) ’ జెండాలను ఆవిష్కరిస్తామన్నారు.
54 మందితో రాష్ట్ర కమిటీ ప్రకటన..
‘మన ఆలోచన సమితి’ వ్యవస్థాపకుడు కటకం నర్సింగరావు బుధవారం 54 మందితో కలిసి అన్ని కులాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర కమిటీని ప్రకటించారు. కమిటీ గౌరవాధ్యక్షులుగా గడ్డం నర్సింహ్మ గౌడ్, దొంత ఆనందం, పూస నర్సింహ్మ బెస్త , రాష్ట్ర అధ్యక్షుడిగా కటకం నర్సింగరావు, 14 మంది ఉపాధ్యక్షులు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు, తొమ్మిది మంది కార్యదర్శులు, ఇద్దరు ఆర్గనైజింగ్ కార్యదర్శులు, ఐదుగురు ప్రచార కార్యదర్శులు, ముగ్గురు అధికార ప్రతినిధులు, ఇద్దరు సోషల్మీడియా ఇన్చార్జులు, ఇద్దరు ట్రెజరర్లు, 14 మంది కార్యవర్గ సభ్యులతో రాష్ట్ర కమిటీని ప్రకటించారు.