26-06-2025 07:35:51 PM
మరొకరికి గాయాలు..
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని ఇటిక్యాల స్టేజి సమీపంలో ఎన్హెచ్-63 రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి (రాత్రి 12.30గంటలకు) రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో సిమెంట్ లోడ్ ట్యాంకర్ డ్రైవర్ తాళ్లపల్లి శ్రీనివాస్(52) అక్కడికక్కడే లారీలో ఇరుక్కుని తీవ్ర గాయాలు అయి మృతి చెందాడని స్థానిక ఎస్సై గోపతి సురేష్(SI Gopathi Suresh) తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... మృతుడు కాశిపేట మండలంలోని పల్లంగుడా గ్రామానికి చెందిన వాడని తన లారీ దేవపూర్ లో లోడ్ చేసుకొని మహారాష్ట్ర నాందేడ్ వైపుకు వెళ్తుండగా లక్షెట్టిపేట వైపు నుండి మంచిర్యాల వైపు వెళ్తున్న సంతూర్ సబ్బుల లోడ్ తో వెళ్తున్న లారీ ఎదురుగా ఢీకొట్టడం జరిగిందన్నారు.
ఈ ప్రమాదంలో రెండు లారీలు నుజ్జునుజ్జు అయి రోడ్డుపైనే ఉండటంతో రాత్రి సుమారు 3 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడంతో సీఐ రమణమూర్తి, ఎస్సై సురేష్ సిబ్బందితో కలిసి రెండు క్రేనులు, జేసిబిల సహాయంతో లారీల్లో ఉన్న డ్రైవర్ శ్రీనివాస్ మృతదేహాన్ని బయటకు తీశారు. రోడ్డుపై నుండి లారీలను తొలగించి వాహనాలను పంపించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ సచిన్ కుమార్ కి కూడా గాయాలు అయ్యాయి. మృతుడు శ్రీనివాస్ భార్య తాళ్లపల్లి విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.