13-06-2025 01:52:24 AM
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు
పినపాక, జూన్ 12 (విజయక్రాంతి): పేదవాడికి కూడు, గూడు, విద్య, వైద్యం అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్షమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం పినపాక మండల పర్యటనలో భాగంగా కార్యక్రమాల్లో పలు ప్రైవేట్, ప్రభుత్వ కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. పినపాక మండలం పొట్లపల్లి గ్రామపంచాయతీ గడ్డిగూడెంలో కొమరం వారి జాతరలో, బోటి గూడెం పంచాయతీ మడతనకుంటలో నల్ల పోచమ్మ జాతరలో పాల్గొన్నారు.
జాతరలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివాసి దేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పినపాక మండలం కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ నమూనా ఇల్లు ప్రారంభోత్సవం చేశారు. సీతంపేట పంచాయతీ, సీతారామపురం పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం ఉప్పాక గ్రామంలో జరుగుతున్న భూభారతి రెవెన్యూ గ్రామ సద స్సులో పాల్గొన్నారు.
అంగన్వాడీ నిర్వహిస్తున్న అంగన్వాడి బాట కార్యక్రమంలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చిన ప్రభు త్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఎన్నికల హామీలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఉచిత పథకా లు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలకు పని లేక ఏదో ఒకటి మాట్లాడటం పపరిపాటిచేసుకున్నారన్నారు. నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకువచ్చి రోల్ మోడల్ గా నిలిపే బాధ్యత తనదన్నారు.
మన గొడుగు వంద పడకల హాస్పిటల్, పినపాక జూనియర్ కాలేజీ గతంలో తన హయాంలోనే వచ్చిందన్నారు. గత పాలకులు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. మాటలతోనే కాలం వెల్లదీస్తున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదన్నారు.
అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామనాథం, స్పెషల్ ఆఫీసర్ తాతారావు, పినపాక ఎంపీడీవో సునీల్ కుమార్, తాసిల్దార్ గోపాలకృష్ణ, ఎంపీఓ వెంకటేశ్వరరావు, సూపర్డెంట్ శ్రీనివాసరావు, హౌసింగ్ డిఈ, ఏఈలు, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.