28-06-2025 01:00:59 AM
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
మలక్పేట్, జూన్ 27(విజయ్ క్రాంతి): రాష్ట్రంలోని దివ్యాంగుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ ల సాధికారిక శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జాతీయ దివ్యాంగుల పార్కులోని హెలెన్ కెల్లర్ విగ్రహానికి పూలమాలవేసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, చైర్మన్ ముత్తినేని వీరయ్య లు నివాళులర్పించారు.
హెలెన్ కెల్లర్ 145వ జయంతిని పురస్కరించుకొని మలక్ పేటలోని దివ్యాంగుల సహకార సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగుల అవసరాలను తీర్చేందుకు రూ.50 కోట్ల నిధులతో సహాయ ఉపకరణాలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కేవలం ఉపకరణాలు మాత్ర మే కాకుండా, వారికి ఆర్థికంగా ఆదుకోవ డం, జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రుణాల సదుపాయాన్ని కూడా ప్రభు త్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
దివ్యాంగ మహిళలకు దివ్యాంగ శాఖను అన్ని విభాగాల్లో అభివృద్ధి చేసేందుకు లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. అనంతరం ప్రభుత్వ బధిరుల ఆశ్రమ విద్యార్థులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి నృత్యాలు అలరించాయి.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ శైలజ, మలక్ పేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ షేక్ అక్బర్, పలువురు అధికారులు, దివ్యాంగ సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు.