10-06-2025 07:34:35 PM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి..
హుజురాబాద్ (విజయకాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రజలకు, నిరుపేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి(BJP District President Gangadi Krishna Reddy) అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని మంగళవారం పార్టీ నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో వైద్య సేవలపైనా, మౌలిక వసతులపైనా సమీక్ష నిర్వహించి, రోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందితో మాట్లాడి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
ఆసుపత్రిలో పలు విభాగాలు సరిగా పనిచేయడం లేదు. దీంతో ప్రజలు ఖరీదైన ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని అనివిమర్శించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, వైద్య సిబ్బందిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వమూ అదే దిశగా సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తూర్పాటి రాజు, ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, గంగిశెట్టి ప్రభాకర్, రావుల వేణు, పైళ్ల వెంకటరెడ్డి, ఓడ్నాల చంద్రిక, ఎంసాని శశిధర్, తిప్పబత్తిని రాజు, సబ్బని రమేష్, యల సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.