30-05-2025 01:32:08 AM
‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది/ కన్నుల్లో నీరు తుడిచీ కమ్మటి కల ఇచ్చిం ది..’ అంటూ అత్యద్భుతమైన భావ కవితా సినీగేయాన్ని సృష్టించిన మహాకవి గుం టూరు శేషేంద్రశర్మ. 98 సం వత్సరాల క్రితం 1927 అక్టోబర్ 20న నెల్లూరు జిల్లా నాగరాజుపాడులో జన్మించిన ఆయన 18 సంవత్స రాల కిందట 2007 మే 30న గుండెపోటుతో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయా రు. ఆయన లోటు అప్పట్లో కవితా ప్రియులందరినీ తీవ్రంగా కలచివేసింది.
కవిత్వం నుంచి వచనం వరకు ఆయన ఏది రాసినా అప్పట్లో సంచలనమే. నిలువెత్తు తెలుగుతనం, నిఖార్సయిన వ్యక్తిత్వంతో మూర్తీభవించినట్టుగా ఉండే ఆ రూపాన్ని సాహితీలోకం ఎప్పటికీ మరవలేదు. ఆయన సృజించిన సాహిత్యమంతా ఒక ఎత్తయితే, ఒకే ఒక్క సినిమా (ముత్యాలముగ్గు)లో రాసిన ఏకైక గీతం ఒక్కటీ అంతగా ప్రజలలో స్థిరపడింది.
సుప్రసిద్ధ దర్శకుడు బాపు దర్శకత్వంలో 1975లో విడుదలైన ‘ముత్యాల ముగ్గు’ సినిమా కోసం శేషేంద్ర రాసిన ‘నిదురించే తోటలోకి..’ పాట పుట్టి ఈ ఏడాదికి యాభై ఏళ్లవుతుంది. ఆయన అద్భుత కావ్యం ‘నాదేశం నాప్రజలు’ కావ్యరచన కూడా అదే సంవత్సరం విడుదల కావడం విశేషం.
శేషేంద్ర శర్మలోని కవితాశక్తిని తెలుసుకోవాలంటే ఈ ఒక్క పాట వింటే సరిపోదు. కానీ, అన్నం ఒక్క మెతుకును ముట్టినట్టు ఈ ఒక్క పాటలోని సాహిత్యసృజన యావత్ మహాకవి గొప్పతనాన్ని చాటి చెబుతుందనడంలో సందేహం లేదు. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఎంతటి వారికైనా భరించశక్యం కాదు.
అంతటి శ్రీరాముడే దానికి అవశుడైనాడు. అలాంటిది ఒక సాధారణ గృహణి మనసు తట్టుకొని నిలబడాలంటే, ఆమెలోని ఆర్ద్రతకు అద్దం పట్టే అక్షరాలు కావాలి. అందుకు శేషేంద్ర కలం సరిగ్గా సరిపోయింది. ఎంతో సరళమైన పదాలతో సాగిన ఈ పాట ఎంతటి వారికైనా విన్నకొద్దీ వినాలనిపిస్తుంది.
అంతటి బాధలోనూ సన్నని ఒక ఆశాదీపం ఉంటుందన్న సందేశం తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చింది. అడవికి వసంతం వచ్చినట్టు విఫలమైన కోర్కెలు కూడా సమయం వచ్చినప్పుడు గుమ్మంలోకి వచ్చి తలుపు తడతాయని చెప్పిన తీరు అమోఘం.
అన్యాయంగా నది దోచుకుపోతున్న నావను ఆపమని, దుఃఖం భరించలేని రేవు సైతం బావురుమని విలపిస్తోందంటూ కొమ్మల్లోని పక్షులను, గగనంలోని మబ్బులను కవి వేడుకున్న తీరు సింప్లీ సూపర్బ్. ఈ పాటకు కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చగా, సుశీలమ్మ అత్యంత మధురంగా, ఆర్తితో ఆలపించింది.
సంగీత. బాపు చిత్రించిన రమణీయ దృశ్యాలు అజరామరం. జలపాతం వంటి భావ కవిత్వంలోనే చైతన్యజ్వాల వలె అభ్యుదయాన్ని ప్రకాశింపజేసిన ఘనుడుగా శేషేంద్ర ఒక్క తెలుగులోనే కాదు, యావత్ భారతీయ సాహిత్య చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచి ఉంటారనడంలో సందేహం లేదు.
@ నిహిర