30-05-2025 01:30:41 AM
ఇవాళ భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలు ముందే వచ్చిన నైరుతి తెచ్చిన అకాల అతిభారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా దేశంలోనేకాక యావత్ ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో అతివృష్టి పరిస్థితులు గణనీయ స్థాయిలో ఆస్తి ప్రాణ నష్టాలకు కారణమవుతున్నాయి.
దీనికంతటికినీ మూలమైన వాతావరణ మార్పులకు సం బంధించిన ఒక వార్త తాజాగా శాస్త్రవేత్తలతోపాటు సామాన్యులను సైతం హడలెత్తి స్తున్నది. ఒక్క కిందటేడాది (2024)లోనే మానవ చర్యలవల్ల ఉత్పన్నమైన అధిక ఉష్ణోగ్రతలు భయానక స్థాయిలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు యావత్ ప్రపంచానికే ప్రమా ద హెచ్చరిక (గ్లోబల్ రెడ్ అలర్ట్) జారీ చేశారు. పెరిగిన ఉష్ణోగ్రతల మూలంగా పుట్టిన అడవి మంటలు ఒక్క గతేడాదిలోనే రికార్డు స్థాయిలో అటవీ నష్టాన్ని సృష్టించినట్లు నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు.
ఈ అటవీ మంటలు 4.1 గిగాట న్నుల గ్రీన్హౌస్ వాయువులను విడుదల చేశాయని, ఇది 2023లో అన్ని వాణిజ్య విమాన ప్రయాణాల నుంచి వెలువడిన ఉద్గారాల కంటే నాలుగు రెట్లు ఎక్కువని వారు అంటున్నారు. ఒక్క న్యూజెర్సీలో ఏర్పడిన కార్చిచ్చుతోనే వేల ఎకరాల పర్యావరణం విధ్వంసమైందని, అనేక ప్రాంతాల ప్రజలు తమ నివాస భూభాగాలను ఖాళీ చేశారని వారు వెల్లడించారు.
కార్చిచ్చులు, జలప్రళయాలు
కొత్త ఉపగ్రహ డేటా ప్రకారం, 2024లో ప్రపంచవ్యాప్తంగా అటవీ నష్టం రికార్డు స్థాయికి పెరిగింది. కార్చిచ్చులు 6.7 మిలియన్ హెక్టార్ల ఉష్ణమండల ప్రాథమిక అడవులను నాశనం చేశాయి. - ఇది మునుపటి సంవత్సరం కంటే దాదాపు రెట్టింపు. ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ విడుదల చేసిన సమాచారం మేరకు, మొదటిసారిగా, ఉష్ణమండల అడవుల నష్టానికి వ్యవ సాయం కాదు, మంటలు ప్రధాన చోదక శక్తిగా నిలిచినట్లు నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘గ్లోబల్ రెడ్ అలర్ట్’గానే వారు పిలుస్తున్నారు.
ఈ ప్రకృతి విపత్తులు ఇక్కడితో ఆగుతాయా? లేక మరిన్ని విధ్వంసాలకు తెరతీస్తాయా? అన్నది శాస్త్రవేత్తలకే అంతుచిక్కడం లేదు. సముద్రాలు అల్లకల్లోలం కావడం, తుపాన్లు, ఉప్పెనలు, సునామీల స్థాయిలో జలప్రళయానికి దారితీసే పరిస్థితులు ఏర్పడినా ఆశ్చర్యం లేదని కూడా వారు ఆందోళన చెందుతున్నారు.
మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం ‘గ్లాడ్’ (గ్లోబల్ ల్యాండ్ ఎనాలిసిస్ అండ్ డిస్కవరీ) ప్రయోగశాల విశ్లేషణ ఆధారంగా, వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్’కు చెందిన ‘గ్లోబల్ ఫారెస్ట్ వాచ్’ ప్లాట్ఫామ్లో ప్రచురితమైన కొత్త గణాంకాలు, ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న దుర్బల స్థితిగతులను వివరించా యి. ఇటీవలి కాలంలో భయానక స్థాయికి చేరుతున్న కార్చిచ్చుల అటవీ నిర్మూలన మూలంగా సంభవిస్తున్న వినాశకరమైన నష్టాన్ని వెల్లడించాయి.
అడవులే మన శ్వాసకోశాలు
పైన పేర్కొన్న స్థాయి అటవీ నష్టం గడచిన 20 సంవత్సరాల డేటాలో ఎప్పుడూ లేదు. ఇది ఖచ్చితంగా ‘గ్లోబల్ రెడ్ అలర్ట్’ అనే నిపుణులు అభివర్ణిస్తున్నారు.- ప్రతి దేశం, ప్రతి వ్యాపారం, జీవించదగిన గ్రహం గురించి శ్రద్ధ వహించే ప్రతి వ్యక్తికి తమకు తోచిన మేర రక్షణ కోసం తీసుకోవాల్సిన సమిష్టి చర్యకు ఒక పిలుపుగానూ దీనిని భావించాలని వారు అంటున్నారు.
మన ఆర్థిక వ్యవస్థలు, సమాజాలు, ఆరోగ్యం - వీటిలో ఏవీ అడవులు లేకుండా మనుగడ సాగించలేవని తెలుసుకోవాలి. కార్బన్ను నిల్వ చేసి జీవ వైవిధ్యానికి మద్దతు ఇచ్చే కీలక పర్యావరణ వ్యవస్థలైన ఉష్ణమండల ప్రాథమిక అడవులు పనామా పరిమాణంలో నిమిషానికి 18 ఫుట్బాల్స్ మైదానాల చొప్పున అదృశ్యమైనాయి. బోరియల్ ప్రాంతాలలో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినా, చారిత్రాత్మకంగా ఉష్ణమండల అటవీ నిర్మూలనకు అగ్ని ప్రమాదాలు ద్వితీయ కారణంగా ఉన్నాయి.
అయితే, 2024లో మాత్రం ఉష్ణమండల ప్రాథమిక అటవీ నష్టంలో దాదాపు సగం మంటలవల్లే సంభవించింది.- ఇది మునుపటి సంవత్సరాలకంటే 20 శాతం వరకూ పెరిగింది. మానవ కార్యకలాపాలు, పెరుగుతున్న భూ పీడనం, విపరీతమైన వేడి కలయిక, ఎల్నినో, వాతావరణ సంక్షోభం నిరంతర ప్రభావాల వల్ల ఈ మార్పు సంభవించిందని శాస్త్రీయ నివేదికలు పేర్కొన్నాయి.
ప్రత్యేకించి అగ్ని ప్రమాదాల కారణంగా అటవీ నష్టం జరిగిన సంవత్సరంగా 2024 రికార్డును సృష్టించింది. అత్యంత దారుణంగా గత సంవత్సర విధ్వంసకర రికార్డును ఇది బద్దలు కొట్టిందని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రొఫెసర్, ‘గ్లాడ్’ ల్యాబ్ సహ-డైరెక్టర్ పీటర్ పొటాపోవ్ తెలిపారు.
ఈ వినాశకర ధోరణి ఇలాగే కొనసాగితే, కీలకమైన సహజ ప్రాంతాలు శాశ్వతంగా మటుమాయం కాగలవని, తత్ఫలితంగా పెద్ద మొత్తంలో కార్బన్ విడుదల అవుతుందని, వాతావరణ సంక్షోభా న్ని ఇది మరింత తీవ్రతరం చేస్తుందని, మరిన్ని తీవ్రస్థాయి మంటలకు ఆజ్యం పోసినట్టవుతుందని ఆయన వివరించారు.
ఇదే సమయంలో, కొలంబియాలో అటవీ నష్టం దాదాపు 50 శాతం పెరిగింది. అయితే ఎక్కువగా అగ్నిప్రమాదం కంటే అక్రమ మైనింగ్, కోకా సాగు కారణంగానే జరిగినట్టు తెలుస్తున్నది. మధ్య ఆఫ్రికా అంతటా, ముఖ్యంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ), రిపబ్లిక్ ఆఫ్ కాంగో (ఆర్వోసీ) లో అటవీ నష్టం కూడా పెరిగింది.
ఆర్వోసీలో కరువు, అకాల వేడి పరిస్థితుల కారణంగా అగ్ని సంబంధిత నష్టం 45 శాతానికి పెరిగింది. డీఆర్సీలో, దీర్ఘకాలిక పేదరికం, సంఘర్షణ అటవీ నిర్మూలనకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ విధ్వంసం మధ్య, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలలో పురోగతిపైనా ప్రభావం చూపింది. క్షీణించిన భూమిని పునరుద్ధరించడానికి, మంటలను నియంత్రించడానికి దీర్ఘకాలిక ప్రయత్నాల ద్వారా ఇండోనేషియా ప్రాథమిక అటవీ నష్టాన్ని 11 శాతం తగ్గించింది.
మలేషియా 13 శాతం క్షీణతను చూసింది. కెనడా, రష్యా ప్రపంచవ్యాప్తంగా మొత్తం చెట్ల నష్టం 5 శాతం పెరగడానికి దోహదపడ్డాయని నిపుణులు అంటున్నారు.- 2030 నాటికి అటవీ నష్టాన్ని ఆపాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి, ప్రపంచం ఇప్పటి నుంచే ప్రతి సంవత్సరం 20 శాతం అటవీ నిర్మూలనను తగ్గించుకోగలగాలని సూచిస్తున్నారు. కానీ, 2024లో, ఉష్ణమండల అడవుల నష్టం 80 శాతం పెరిగింది.
గట్టి సంకల్పం కావాలి
అటవీ నిర్మూలన, క్షీణతలను ఆపడానికి ప్రపంచ దేశాలు పదేపదే ప్రతిజ్ఞలైతే చేస్తున్నాయి. కానీ, అవి కార్యరూపం దాల్చడం లేదు. అటవీ మంటలు, భూమి నిర్మూలన ఉద్గారాలను పెంచుతాయి. అయితే, వాతావరణం ఇప్పటికే అడవులు స్వీకరించే దాని కంటే వేగంగా మారుతోంది. ఈ సంక్షోభం లెక్కలేనన్ని జాతులను నిర్మూలన అంచుకు నెట్టివేస్తోంది.
ముఖ్యంగా ఆయా దేశాధినేతలు ప్రతిఏటా జరిగే వాతావరణ శిఖరాగ్ర సమావేశాలలో నిబద్ధతతో తీర్మానాలైతే చేస్తున్నారు కానీ, వాటిని పాటించడంలో అందరూ ఘోరంగా విఫలమవుతున్నారు. ఇది పర్యావరణ పరంగా క్షమించరాని నేరం. అదే ఇప్పుడు ప్రపంచాన్ని ప్రమాదం అంచుకు తీసుకెళుతున్నది. ఇప్పటికైనా, దేశాధినేతలు గట్టి రాజకీయ సంకల్పంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేకపోతే, మాట్లాడుకోవడానికి మనమెవరం మిగులుతామో తెలియదు.