ఆమె సేవలు గుర్తించి సత్కరించిన బ్రిటన్ పార్లమెంటు
యూఎన్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గౌరవ డాక్టరేట్ ప్రదానం
లండన్, మే 1: అతిచిన్న వయసు (11)లో సమాజ సేవకురాలిగా అరుదైన గుర్తింపు తెచ్చుకున్న ఎన్ఆర్ఐ కలశకు అరుదైన గౌరవం లభించింది. ఆమె సేవలను గుర్తించిన బ్రిటన్ పార్లమెంటు ఇటీవల కలశను ప్రత్యేకంగా సత్కరించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ గౌరవ డాక్టరేట్ అందించి గౌరవించింది. అ గౌరవం పొందిన అతిపిన్న వయస్కురాలు కలశే కావటం విశేషం. కలశ బ్రిటన్ పార్లమెంటులో రెండు నిమిషాలపాటు అనర్గళంగా ప్రసంగించి పార్లమెంటేరియన్లను అబ్బురపరిచింది. 2013 ఆగస్టు 13న జన్మించిన ఆమె కలశ ఫౌండేషన్ను స్థాపించి సమాజ సేవ చేస్తున్నది. ‘అక్షర కలశం’ అనే పేరుతో ఎందరో చిన్నారులకు విద్యనందిస్తున్నది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళలను గుర్తించి ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తున్నది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నది. చిన్న వయసులోనే గొప్ప పనులు చేస్తున్న కలశ తెలుగు వ్యక్తి కావటం గర్వకారణం.