27-04-2025 08:18:16 PM
గోదావరిఖనిలో బయటపడ్డ ప్రముఖుల అవతారం..
చీకటి వ్యాపారం బట్టబయలు చేసిన జిల్లా వైద్యాధికారిణి..
తమ ఆస్పత్రినే తనిఖీ చేస్తావా? అంటూ పెద్దల తిట్ల పురాణం...
భయంతో తాసీల్దార్ ఆఫీసుకు వెళ్లి దాక్కున్న మహిళా అధికారిణి ప్రసన్న కుమారి...
విస్తుపోతున్న జిల్లా ప్రజలు...
పెద్దపల్లి (విజయక్రాంతి): గోదావరిఖనిలో పడగ విప్పిన ఫ్యాక్షనిజం... వారంతా సంఘంలో పెద్ద మనుషులు... ప్రాణాలు నిలబెట్టే వైద్య వృత్తిలో ఉన్న వాళ్లు.. మరొకరు ఖద్దరు దుస్తులు ధరించిన వారు... ఒకరకంగా గోదావరిఖని ప్రాంతంను చాలా కాలంగా చిటికె వేసి శాసిస్తున్న వాళ్లు... సొసైటీలో ఆస్తులు, మంచి పేరు సంపాదించుకున్న వారి బాగోతం ఒక్కసారిగా బయటపడితే ఇంతకాలం వారు చేస్తున్న చీకటి వ్యాపారం బట్టబయలైతే..? ఏలా ఉంటుంది ఆలోచించండి... నిన్న గోదావరిఖనిలో అదే జరిగింది. నగరంలో మూలకు ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిని సాధారణంగా తనిఖీ చేయడానికి జిల్లా వైద్యాధికారిణి డా. అన్న ప్రసన్నకుమారి రాగా, పెద్ద రాద్దాంతమే జరిగింది.
ప్రభుత్వం నిషేధించిన లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రం బయటపడింది. దాంతో సదరు ఆస్పత్రి వైద్యుడికి రామగుండం మాజీ మేయర్, మరో పిల్లల డాక్టర్, స్థానిక ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడైన మాజీ కార్పొరేటర్లు రంగంలోకి దిగారు. గోదావరిఖనికి వచ్చిందే గాక... ఈ ఆస్పత్రినే తనిఖీ చేస్తావా అంటూ ఇక తమ ప్రతాపం చూపించారు. ఎమ్మెల్యే చెప్పినా వినవా అంటూ ఆ మహిళా అధికారిణికి అడ్డు తిరిగారు. ఈ ఆస్పత్రిపై కేసు నమోదు చేస్తే బాగుండదంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా చూస్తూ పోగైన జనం ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. అసలేం జరుగుతుంది..? అంటూ అందరూ ఉదయం నుంచి సాయంత్రం దాకా జనమంతా విస్తుపోయారు.
ఆటో ఇటో కింద మీద పడి తమ రాజకీయ పలుకుబడి ప్రయోగించి చివరకు డీఎం అండ్ హెచ్ ఓపై పోలీసులతో కేసు నమోదు చేయించారు. ఇక చట్టబద్దంగా తన విధులకు ఆటంకం కలిగించడమే గాకుండా తనను బూతులు తిట్టడంతోపాటు నిషేధిత స్కానింగ్ యంత్రం కలిగి ఉండటం వంటి వాటిపై డీఎంహెచ్ ఓ సైతం ఫిర్యాదు చేయగా గోదావరిఖని పోలీసులు మాజీ మేయర్ అనిల్ కుమార్, వైద్యులు డా. నాగిరెడ్డి, క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిల పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐతే ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళుతుందో అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఫ్యాక్షనిజంను తలదన్నే రీతిలో గోదావరిఖనిలో జరిగిన ఈ వివాదస్పద సంఘటన పర్యవసానం ఏలా ఉంటుందో వేది చూడాలి. ఐతే ఈ సంఘటన నేపథ్యంలో గోదావరిఖనిలో అనుమతి లేని ప్రైవేటు దుకాణాల చిట్టా కూడా బయటకు వస్తుండటంతో మిగతా హాస్పిటళ్ల వైద్యులు కంగారు పడుతున్నారు.
అసలేం జరిగిందంటే...
నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్ లో నిబంధనలకు విరుద్ధంగా గర్భస్త లింగ నిర్ధారణ స్కానింగ్ యంత్రం ఉన్నట్లు ఫిర్యాదు రావడంతో జిల్లా వైద్యాధికారిణి డా. అన్న ప్రసన్నకుమారి శనివారం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సదరు హాస్పిటల్లో తనిఖీ కోసం వెళ్లింది. ఆసమయంలో విధుల్లో ఉన్న చిప్పకుర్తి ఆనందలను స్కానింగ్ గది చూపించాలని ఒత్తిడి చేసి ఆనందంను గదికి తీసుకవెళ్లి గది తాళం పగులగొట్టించి స్కానింగ్ యంత్రంను తాసీల్దార్, పోలీసుల సమక్షంలో సీజ్ చేశారు. తనను అవమానించి దౌర్జన్యంకు పాల్పడినట్లు ఆనందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎంహెచ్ ఓ పై 296(బీ), 352, 351 బీఎస్ సెక్షన్ల కింద 1-టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐతే విధి నిర్వహణలో ఉన్న తనను బెదిరింపులకు పాల్పడటమే గాకుండా విధులకు ఆటంకం కలిగించి అనుమతి లేని స్కానింగ్ యంత్రం కలిగి ఉండి తన డ్యూటీ చేయకుండా అడ్డుకున్నారని డీఎంహెచ్ ఓ ఇచ్చిన పిర్యాదుతో ఆదివారం రామగుండం మాజీ మేయర్ అనిల్ కుమార్, ఆస్పత్రి వైద్యులు నాగిరెడ్డి, ఐఎంఏ అధ్యక్షులు డా. క్యాస శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామిలపై 1- టౌన్ పోలీసులు 318(4), 132, 292, 351(2), రీడ్ విత్ 3(5)బీఎస్ఎస్ 29 సెక్షన్ల కింద కౌంటర్ గా పోలీసులు మరో కేసు నమోదు చేశారు. ఈ సంఘటన జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్నది. అటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని వైద్యులు, సిబ్బంది విధులు బహిష్కరించి దశలవారీ ఆందోళనలు చేపట్టడానికి మూకుమ్మడి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
ఫ్యాక్షనిస్టుల్లా ప్రవర్తించారు
లాయర్ల దంపతులను చంపినట్లు నిన్ను చంపుతమన్నారు
డీఎంహెచ్ ప్రసన్న కుమారి..
ఆ హాస్పిటల్లో గర్భస్త లింగ నిర్ధారణ ప్కానింగ్ యంత్రం ఉందని వచ్చిన ఫిర్యాదుతో తాను కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశాల మేరకు తనిఖీ కోసం వెళ్లగా, అక్కడి వైద్యులు, ఓ మాజీ కార్పొరేటర్ తాము ఎమ్మెల్యే మనుషులమని, ఇక్కడకు ఎందుకు వచ్చావు..? చట్టాలు మాకు పని చేయవు..? ఇక్కడ నుంచి వెళ్లు అంటూ తన విధులకు ఆటంకం కలిగించడమే గాకంపడా ఫ్యాక్షనిస్టుల్లా మీద పడ్డారనీ, నిన్ను గట్టు వామనరావు లాయర్ల దంపతులను చంపినట్లు నిన్ను చంపుతమన్నరని, దాంతో నేను భయపడి తాసిల్దార్ ఆఫీసుకు వెళ్లి గంట పాటు అక్కడే తల దాచుకోవాల్సి వచ్చిందని డీఎంహెచ్ఓ అన్న ప్రసన్నకుమారి అవేదనతో వివరణ ఇచ్చారు.