10-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 9 (విజయ క్రాంతి): జిల్లాలోని వివిధ ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియం ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో ప్రభుత్వ భవనాల నిర్మాణం, మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్షించారు.
ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీ గోడలు, టాయిలెట్స్, కిచెన్ షెడ్, వివిధ ప్రభుత్వ భవనాల మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాలకు పనులు మంజూరు చేశామని తెలిపారు. ఈ పనులకు సంబంధించిన గ్రౌండింగ్ 100 శాతం పూర్తి చేయాలన్నారు. ఏఈలు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనులు మొదలయ్యేలా చూడాలన్నారు.
ఇది వరకే మొదలైన పనులను వేగవంతం చేసి రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడి కేంద్రాలను స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, కమ్యూనిటీ హాల్లోకి తరలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, జిల్లా రెవెన్యూ అధికారులు వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్, డి.ఎం.డబ్ల్యూ.ఓ పవన్ కుమార్పాల్గొన్నారు