07-06-2025 12:00:00 AM
హైదరాబాద్, జూన్ ౬ (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేశ్గౌడ్ సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, తమ పనితీరును బేరీజు వేసుకోవాలని ఆయన సూచించారు. కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవటంతో కార్యకర్తలు నిరాశలో ఉన్నారని, వారిని సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.
గాంధీభవన్లో శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశం జరిగింది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షినటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీమంత్రి జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ పనితీరును మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఎమ్మెల్యేల కృషి చాలా అవసరమని వాపోయారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు.
బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కొనేందుకు పార్టీ క్యాడర్ను సన్నద్ధం చేయాలని, రాహుల్గాంధీని ప్రధానిగా చూడాలనే ఆకాంక్షతో పని చేయాలన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా.. ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం రావడం లేదన్నారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం పూర్తి అయ్యే అవకాశం ఉందని, కుల, ప్రాంతీయ సమతౌల్యతను పాటిస్తామని స్పష్టం చేశారు.
బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసే ప్రక్రియ ఈ నెలలో పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని, అధికారంలో ఉన్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని మహేశ్ సూచించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుడా పని చేస్తోందని స్పష్టం చేశారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలున్న మాట వాస్తవమేనని, వాటిని అధిగమించేందుకు ప్రయత్నించాలని కోరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేలు క్యాడర్తో సమన్వయం పాటించాలని ఆదేశించారు.