07-06-2025 12:00:00 AM
-అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రభుత్వం చేపట్టిన భూ భారతి ద్వారా భూసమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్ అన్నారు. శుక్ర వారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం సింగారావుపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సును సందర్శించి దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభు త్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.
రైతులు రెవెన్యూ సదస్సు లను సద్వినియోగం చేసుకొని తమ భూ సమస్యలపై వివరంగా దరఖాస్తులు సమర్పించాలని, రికార్డులను సరి చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యను త్వరగా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులలో స్వీకరించిన దరఖాస్తులను కేటగిరీల వారిగా రిజిస్టర్లు నమోదు చేసి వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు తో పాటు భూమికి సంబంధించిన పత్రాలను జతపరిచినట్లయితే త్వరగా పరిష్కరించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రియాజ్ అలీ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి ...
-రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని రెబ్బెన మండలం ఎడవెల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటుచేసిన కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు తరలించాలని తెలిపారు.
వర్షాలు సమీపిస్తున్నందున ధాన్యం తడవకుండా కొనుగోలు కేంద్రాలలో టార్పాలిన్ కవర్లను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం మండలంలోని కొండపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు హాజరై దరఖాస్తు ప్రక్రియను పరిశీలించారు. భూభారతి చట్టంలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సూర్యప్రకాష్, రెవెన్యూ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.