టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లలో టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైంది. మల్టీజోన్ (వరంగల్)లో ఈ నెల 9 వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులైన వారి సీనియారిటీ జాబితాను వెల్లడించనున్నారు. మల్టీజోన్ (హైదరాబాద్)లో శనివారం నాడు గెజిటెడ్ హెచ్ఎం పదోన్నతులకు అర్హులైన స్కూల్ అసిస్టెంట్ జాబితాను అందుబాటులో ఉంచగా 10, 11వ తేదీల్లో మాత్రం తుది సీనియారిటీ జాబితాను ప్రకటించి, వెబ్ ఆప్షన్ల నమోదు, పదోన్నతి ఉత్తర్వులు జారీ చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా 18,495 మంది టీచర్లు పదోన్నతి పొందనుండగా, గతేడాది 12,472 మంది బదిలీ కాగా ఈసారి మాత్రం దాదాపు 40 వేల మందికిపైగా టీచర్లు బదిలీ అవుతారని అధికారులు అంచనా వేస్తు న్నారు. ఇదిలా ఉంటే ఈ బదిలీలు, పదోన్నతుల్లో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న పలువురు టీచర్లు కోర్టు మెట్లు ఎక్కేందుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం.






