15-06-2025 05:23:26 PM
తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు దోటి వెంకన్న..
చండూరు (విజయక్రాంతి): భవన నిర్మాణ సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ రంగానికి అప్పజెప్పే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ(AITUC) తెలంగాణ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్(Telangana Building and Construction Workers Union) జిల్లా అధ్యక్షుడు దోటి వెంకన్న(Doti Venkanna) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం చండూరులోని సిపిఐ కార్యాలయం మాధగోని నరసింహ భవనంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ చండూరు మండలం సమావేశం భూతరాజు శ్రీను అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న సంక్షేమ బోర్డును ఇన్సూరెన్స్ రంగాలకు ఇవ్వాలని ప్రభుత్వము ఆలోచన చేయడం బాధాకరమని అన్నారు. 2009 నుంచి మన రాష్ట్రంలో లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా కార్మికులకు పథకాలు అందుతున్నాయి ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా భీమా రంగానికి అప్పజెప్పడం ఎంతవరకు సమంజసం ఆయన అన్నారు.భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా చెల్లిస్తున్నటువంటి డబ్బులు లేబర్ డిపార్ట్మెంట్ చేతులు దులుపుకొని బీమా కంపెనీకి అప్పజెప్పడంలో మతల ఏంటో చెప్పాలని ఆయన అన్నారు. భీమా కంపెనీలకు అప్పజెప్పడం అంటే సంక్షేమ బోర్డు ఎత్తి వేసే కుట్రలో భాగమే అని ఆరోపించారు.
ఈ నెల నాలుగో తేదీన గుట్టు చప్పుడు కాకుండా సంక్షేమ బోర్డు వారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి టెండర్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారని ఆయన అన్నారు. లేబర్ అధికారులు తమ పని భారం తగ్గించుకోవడం కోసం బీమా కంపెనీలకు సంక్షేమ బోర్డు నిధులు మళ్ళిస్తున్నారని ఆయనఅన్నారు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డును కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. కార్మికుల స్థితిగతుల గురించి కార్మిక శాఖ అధికారులకు సరైన అవగాహన ఉంటుందని నిజమైన కార్మికులను గుర్తించడంలో లేబర్ శాఖ మరింత భవనిర్మాణ సంక్షేమ బోర్డు క్లైములు భీమా కంపెనీలకు అప్పజెప్పే టెండర్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏఐటియుసి ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీన హైదరాబాదులోని లేబర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షుడు జెల్లా శ్రీను , ఏఐటీయూసీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్షుడుభూతరాజు శ్రీను , ప్రధాన కార్యదర్శి చందా మదనయ్య, ఎలవర్తి లింగయ్య, పేర్ల గురుస్వామి, నకిరేకంటి శ్రీను, పోలే యాదయ్య, పర్సనబోయిన శివ, దాసరి యాదగిరి, ఇరిగి శంకర్, ఈదులకంటి యాదయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.