19-02-2026 12:00:00 AM
ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ధర్మజాగరణ సహస సంయోజక్ ఏలే శ్యామ్ కుమార్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): హిందూ సమాజాన్ని జాగృతం చేయడంలో సమాజంలోని ప్రతిష్ఠిత వ్యక్తుల పాత్ర అత్యంత కీలకమైందని అఖిలభారత ఆర్ఎస్ఎస్ధర్మ జాగరణ సహ సంయోజక్ ఏలే శ్యాంకుమార్ వ్యాఖ్యానించారు. అందుకే దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని ప్రముఖ నగరాలలోని హిందూ సమాజానికి చెందిన ప్రతిష్ఠిత వ్యక్తుల సమ్మేళనాలను ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తోందన్నారు.
భారతదేశ యొక్క ఎదుగుదలను ఓర్వలేని విదేశాల యొక్క కుట్రలలో భాగంగా కొన్ని సంస్థలు మరియు దేశ విచ్చిన్నకర శక్తులు అందరూ ఏకమై హిందూ సమాజాన్ని విచ్చినం చేయడానికి ఎన్నో రకాల కుట్రలకు పాల్పడుతున్నారని వాటన్నింటినీ సమిష్టిగా హిందూ సమాజం ఎదుర్కోవడానికి కావలసిన ఐకమత్యాన్ని నిర్మాణం చేయడం కోసమే ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు.
నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ ప్రతిష్టిత వ్యక్తుల సమావేశంలో బుధవారం ఆయన ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ తన అస్తిత్వం కోసం ఏనాడూ పని చేయలేదని కేవలం హిందూ సమాజం కోసం భారతదేశ కోసం మాత్రమే తన 100 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించిందని రానున్న కాలం మొత్తం కూడా దేశం కోసమే పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకట్రావు, జిల్లా సంఘచాలక్ డాక్టర్ కాపర్తి గురుచరణం, విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్, నగర కార్యవాహ అరుగుల సత్యం, జిల్లా,నగరంలోని ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు.