13-10-2025 12:00:00 AM
యాదాద్రి భువనగిరి; అక్టోబర్ 12 (విజయక్రాంతి) : ఎందరో మేధావులు, సామాజిక కార్యకర్తలు అవినీతి నిర్మూలన కొరకు, కేంద్ర , రాష్ర్ట ప్రభుత్వాలు పాలనలో పారదర్శకంగా, జవాబుదారీతనంగా ఉండాలని, ఎంతో కాలంగా చేసిన కృషి ఫలితంగా ఏర్పడ్డ చట్టం సమాచార హక్కు చట్టం -2005. ప్రస్తుతం పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఆర్టీఐ చట్టం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒకే ఒక్క దరఖాస్తుతో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ను సైతం కదిలించిందంటే, సమాచార హక్కు చట్టం ఎంత బలమైనదో మనం అర్థం చేసుకోవచ్చు. అదే మన సమాచార హక్కు చట్టం -2005 యొక్క గొప్పతనం. మన దేశంలో స్దానిక, జాతీయ స్థాయిలో కలిపి సుమారు 15 వేల సంఖ్యలో మన రక్షణ చట్టాలున్నాయి. వాటన్నింటిలో కల్లా బలమైన చట్టం సమాచార హక్కు చట్టం అని చెప్పవచ్చు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం ఉండాలని “హమారా పైసా - హమారా హిసాబ్ ( మా డబ్బుల లెక్కలు మాకు తెలియాలి)” అనేది ప్రజల హక్కు. కానీ ప్రజలు కోరిన సమాచారాన్ని అధికారులు నిర్లక్ష్యంతో మరి కొంత అవగాహనా రాహిత్యం తో దరఖాస్తు దారులకు సమాచారాన్ని సకాలంలో ఇవ్వక, ఒకవేళ ఇచ్చినా తప్పుడు సమాచారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు.
దీంతో దరఖాస్తుదారులు కమీషన్ కు వెళ్ళాల్సి వస్తుంది. దీనికి తోడు మన పాలకులు అటు కేంద్రంలో ఇటు రాష్ర్టంలో సమాచార చట్టాన్ని రక్షించే కమీషనర్ లను చట్టంలో చూపిన సంఖ్య విధంగా పని భారం ను అనుసరించి పది నుంచి పన్నెండు మంది సమాచార కమీషనర్ లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. కానీ మన పాలకులు నిర్లక్ష్యంతో సరిపడా కమీషనర్ లను నియమించక పోవడంతో చట్టం నిర్వీర్యం అవుతుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
పూర్తి స్థాయిలో కమీషనర్ల నియామకం జరగాలి
సమాచార హక్కు చట్టం -2005 లో తెలిపిన ప్రకారం పూర్తి స్థాయిలో ఒక ప్రధాన కమిషనర్ 11 మంది కమీషనర్ ల నియామకం చేయాలని యునైటెడ్ ఫోరం ఫర్ రైట్ ఇన్ఫర్మేషన్ ఆక్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. కొన్ని సంవత్సరాలుగా “సమాచార కమీషన్” ఏర్పాటు చేయకపోవడంతో రాష్ర్టంలో సుమారు 17 వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని ఆయన అన్నారు.
ఒకానొక సందర్భంలో తెలంగాణ రాష్ర్ట హైకోర్టు జోక్యం చేసుకుని తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం “సమాచార కమీషన్” ను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయినా గత పాలకులు స్పందించలేదన్నారు.
కొత్త ప్రభుత్వం లో నియమించబడిన కమీషనర్ లు “ప్రజల పక్షాన పని చేయాలని, ప్రతి సంవత్సరం వార్షిక నివేదిక వెల్లడించాలని, వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని, సమాచార హక్కు చట్టాన్ని నిర్లక్ష్యం చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, వారికి షోకాజ్ నోటీసులు ఇస్తూ, జరిమానాలు విధించాలని” కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు.