12-06-2025 01:19:52 AM
ప్రారంభానికి సిద్ధమైన పాఠశాలలు
మహబూబాబాద్, జూన్ 11 (విజయ క్రాంతి): నేటి నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు 1,200 పైగా ఉన్నాయి. 2025 26 విద్యా సంవత్సరం గురువారం ప్రారంభిస్తుండగా, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను, ఒక జత దుస్తులను ఉచితంగా అందించడానికి ఇప్పటికే పాఠశాలలకు పంపిణీ చేశారు.
పాఠశాలలో విద్యార్థులకు తొలి రోజు నుంచే ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలతో ముందస్తు చర్యలు చేపట్టారు. మండల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో గ్రామస్థా యిలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నారు.
పాఠశాలల ఆవరణ లో శుభ్రం చేయడంతో పాటు తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్ ఇతర మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకున్నారు. పాఠశాలలను సుందరంగా ముస్తాబు చేసి, నేడు పాఠశాలల ప్రారంభం రోజున పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఘనంగా స్వాగతం చెప్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
పెరగనున్న విద్యార్థుల నమోదు
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ కార్యక్రమాలను వివరించడంతోపాటు ప్రత్యేకంగా విద్యార్థుల నమోదు కోసం నిర్వహించిన బడిబాట వల్ల ఈసారి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సంఖ్య పెరుగుతుందని ఉపాధ్యాయ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించడంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన విద్యా బోధనతో పాటు పాఠ్యపుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం తదితర వసతులను తల్లిదండ్రులకు వివరించడంతో ఈసారి తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించడానికి ఆసక్తి చూపినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.