6 April, 2026 | 11:17 AM

మోసాల తృతీయ

02-12-2024 02:50 AM
  1. సెలబ్రిటీల పేర్లు చెప్పి ఘరానా మోసం
  2. నటి పరిణీతి చోప్రా వ్యాపార భాగస్వామి అని ప్రచారం 
  3. వ్యాపారం పేరిట నమ్మించి రూ.100 కోట్ల వసూలు ?
  4. పోలీసుల అదుపులో తృతీయ జ్యువెలరీ అధినేత కాంతిదత్

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 1 (విజయక్రాంతి): తమ వ్యాపార సంస్థలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా భాగస్వామి అని, తమ ఉత్పత్తులకు, సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ అని, ప్రముఖ సినీ తారలు సమంత, కీర్తి సురేశ్ కూడా బ్రాండ్ అంబాసిడర్లుగాఉన్నారంటూ పలువురు సెలబ్రి టీల పేర్లు చెప్పి కొంతమంది యువ వ్యాపార వేత్తలను మోసగించిన తృతీ య జ్యువెలరీస్ అధినేతను జూబ్లీహి ల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

జూబ్లీహిల్స్ రోడ్ నంబర్.36లో వైజాగ్‌కు చెందిన తోనంగి కాంతిదత్, వైజాగ్‌కే చెందిన శ్రీజరెడ్డి తిప్పలతో తృతీయ ఫైన్ జ్యు వెలరీ పేరిట స్టోర్‌ను ఏర్పాటు చేయించాడు. స్టోర్ కోసం శ్రీజరెడ్డి రూ.2.50 కోట్లు వెచ్చించింది. స్టోర్ ప్రారంభోత్సవానికి గతేడాది సెప్టెంబర్ 7న బాలీ వుడ్ నటి పరిణీతి చోప్రాను తీసుకొచ్చాడు.

ఇందుకోసం నటికి ఇవ్వాలంటూ శ్రీజరెడ్డి దగర్గ నుంచి రూ. కోటి 50 లక్షలు తీసుకున్నాడు. కానీ పరిణీతి చోప్రాను తృతీయ జ్యూవెలరీస్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించి ప్రమోషన్ల కోసం ఉపయోగిం చుకుని ఆమెకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా మోసం చేశాడు.

కాగా స్టోర్ విషయంలో శ్రీజరెడ్డితో విభేదాలు రావడంతో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి డైరెక్టర్ పదవి నుంచి ఆమెను తొలగించి తన తల్లిని ఆ స్థానంలో నియమించాడు. దీంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ అతనిపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో శ్రీజరెడ్డి శనివారం ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనిపై ఛీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా..

నాలుగేళ్ల నుంచి స్టార్టప్ కంపెనీలను స్థాపిస్తూ కాంతిదత్ వాటిలో పెట్టుబడుల పేరిట కోట్లు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడయినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేశాడు.

గతంలో ‘సస్టెయిన్ కారు’్డ అనే సంస్థను స్థాపించి ప్రముఖ సినీతారలు సమంత, కీర్తిసురేశ్, ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డిలతో కూడా పెట్టుబడులు పెట్టించినట్లు తెలుస్తోంది. ఇలా పలువురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేసి ఉండొచ్చని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో కొన్నిరోజుల తర్వాత ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి నుంచి రూ.3.50 కోట్లు తీసుకుని తృతీయ జ్యూవెలరీలో డైరెక్టర్‌గా చేర్చుకున్నాడు.

నటి పరిణీతి చోప్రాకు వాటా ఉందని ఆయనను కూడా నమ్మించాడు. కొన్ని రోజులకు తాను మోసపోయినట్లు గుర్తించిన ప్రవీణ్ సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గౌతమ్ అనే మరో వ్యక్తి కూడా కాంతిదత్‌పై ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇప్పటివరకు సెలబ్రిటీల పేరిట సుమారు రూ.40 కోట్లు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలగా..

దాదాపు రూ.100 కోట్లు మోసానికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. మయోమీ కెఫేల పేరుతో పెద్దఎత్తున మోసానికి పాల్పడడం, వెండర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలు ఎగ్గొట్టాడని వారంతా జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి కూడా కాంతిదత్ తనను మోసం చేసినట్లు ఇప్పటికే వీడియోను విడుదల చేసింది. నిందితుడు మోసం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదులు వచ్చాయి.

జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు. కాంతిదత్‌పై  సీసీఎస్‌లో కూడా కేసు నమోదైంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా తాను ఎవరినీ మోసం చేయలేదని, అవన్నీ అబద్ధాలని ఇటీవల కాంతిదత్ తన సోషల్‌మీడియా పేజీలో పోస్టు కూడా పెట్టారు.