08-07-2024 12:49:48 AM
తెలంగాణకు కరెంటే జీవనాడి లాంటిది. రాష్ట్రంలో రెండు ప్రధాన నదులు ప్రవహిస్తున్నా.. ఆ నదీ జలాలను వాడుకోవాలన్నా కరెంటే కావాలి. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ రైతులు, ప్రజలు కరెంటుకోసమే కొట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కరెంటు కొరతను అధిగమించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టింది. అందులో ప్రధానమైనవి మూడు. ఒకటి ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలు. రెండోది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరులో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు, మూడు.. నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు. ఈ మూడింటి విషయంలో మొదటి నుంచీ విమర్శలు, అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. బీఆర్ఎస్ పాలనలో విద్యుత్తు ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రేవంత్రెడ్డి ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ విచారణతోపాటు, దాని ఏర్పాటుపైన కూడా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు అభ్యంతరం తెలిపారు. ఇదే విషయంలో ఆయన హైకోర్టుకు కూడా వెళ్లినా ప్రభుత్వానికే అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు కమిషన్ విచారణలో వేగం పెంచింది. విద్యుత్తు విషయంలో మొదటి నుంచీ బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నవారు అసలు తప్పులు ఎక్కడ జరిగాయనే అంశంపై కమిషన్కు వివరాలు అందిస్తున్నారు. ఈ అంశాలపై ప్రజలు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి కమిషన్ దృష్టి సారించవల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు
* బీహెచ్ఈఎల్ ద్వారా తన పాత యంత్రపరికరాలను తెలంగాణ ప్రభుత్వానికి అంటగట్టిన ఇండియా బుల్స్ సంస్థపై కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలి. ఇండియా బుల్స్ నుంచి పరోక్ష చెల్లింపులు, ఒప్పందం ప్రకారం ప్లాంటు పూర్తి సామర్థ్యం మేరకు నడుస్తున్నదా? లేదా? ఈ విషయంలో ఏమైనా జరిమానాలు విధించారా? అన్న అంశంపై కూడా దర్యాప్తు నిర్వహించాలి.
* ఒప్పందం ప్రకారం విద్యుత్తు సరఫరా చేయలేకపోయిన ఛత్తీస్గఢ్ జెన్కో తనకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వం క్లెయిమ్ చేసిన మొత్తాన్ని వెంటనే ఆ రాష్ట్రం నుంచి రాబట్టాలి. పీజీసీఐఎల్కు రీయింబర్స్మెంట్ కింద చెల్లించిన మొత్తాన్ని కూడా రాబట్టాలి.
* సింగరేణి ఎంతో సమర్థవంతమైన సంస్థ. బొగ్గు మైనింగ్లో అపార అనుభవం ఉన్న సంస్థ. ఈ సంస్థను విదేశాల్లో బొగ్గు గనులను దక్కించుకొనేలా విస్తరించాలి. అలా చేస్తే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఖర్చులు తగ్గుతాయి.
* తెలంగాణ, ఒడిశాతోపాటు ఇతర రాష్ట్రాల్లో బొగ్గు గనుల సమీపంలో, నౌకాశ్రయాల వద్ద సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటుచేయాలి.
* ఎన్టీపీసీ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే తక్కువ ఖర్చుతో విద్యుత్తు ప్లాంట్లను నిర్మించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిశీలించాలి.
* సీఎంగా తన నిర్ణయాల వెనుక అసలు కారణాలను ప్రజలకు తెలిపేందుకు గొప్ప అవకాశంగా భావించి మాజీ సీఎం కేసీఆర్ విద్యుత్తు విచారణ కమిషన్ ముందు హాజరు కావాలి.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి