రాత్రి సమయంలో కూడా మొక్కజొన్న అన్లోడింగ్ కొనసాగాలి
కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం/లక్ష్మీదేవిపల్లి, మే 26 (విజయక్రాంతి): లక్ష్మీదేవిపల్లి మండలంలోని బంగారుచెలక మొక్కజొన్న నిల్వ గోడౌన్తో పాటు ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. బంగారుచెలక మొక్కజొన్న గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్, గోడౌన్కు చేరుతున్న మొక్కజొన్న లారీల అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
గోడౌన్లో 2,500 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని అధికారులు కలెక్టర్కు వివరించారు. సుజాతనగర్, కొత్తగూడెం, టేకులపల్లి, ఇల్లందు, చర్ల, సమ్మెట, బూర్గంపాడు, ఆళ్లపల్లి, గుండాల తదితర మండలాల నుంచి మొక్కజొన్న ఇక్కడికి తరలిస్తున్నట్లు తెలిపారు. అన్లోడింగ్ ప్రక్రియ ఆలస్యం కాకుండా రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం తగిన లైటింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
హమాలీలతో మాట్లాడిన కలెక్టర్, ఒక్క లారీ అన్లోడింగ్కు ఎంత సమ యం పడుతోంది, ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. హమాలీలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఇల్లందు క్రాస్ రోడ్ వద్ద నిర్మాణంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు. భవన నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, పూర్తి స్థితిపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు.
గత సంవత్సరం మే నెలలో ప్రారంభమైన పనులు ఇప్పటివరకు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, పనుల ఆలస్యానికి గల కారణాలను వివరంగా నివేదించాలని ఆదేశించారు. నూ రాజీ పడవద్దని స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో తాసిల్దార్ శిరీష, పంచాయతీరాజ్ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






