ప్రపంచం మాయ కాదు!
5న డా. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి
డా. సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పే మాయావాదానికి ఇతర భారత తత్వశాస్త్రజ్ఞులు చెప్పే మాయావాదానికి చాలా తేడా వుంది. తన దృష్టిలో మాయావాదమంటే మిధ్యావాదం కాదు. ప్రపంచం మాయ అంటే ‘ప్రపంచం లేదు’ అని కాదు. ‘ఈ ప్రపంచం అనాది పదార్థం కాదని’ మాత్రమే ఆయన ఉద్దేశ్యం. అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ, అర్థం చెప్పటానికి వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలలో ఇమిడిఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది.
అయితే, ఈ ప్రపంచం అవాస్తవికమైందనిగానీ, లేనిదనిగానీ అర్థం చెప్పటానికీ వీల్లేదు. ఈ ప్రపంచం వాస్తవికమైందనే ఆయన నిర్ణయం. దాని అస్తిత్వం వారి పూర్ణభావాలతో ఇమిడి ఉంది. ఈ ప్రపంచంలో కనపడే, రూపభేదాలకు మూలం పరిపూర్ణ భావంలో వుంది. అయితే, ఈ రూపభేదాలు బ్రహ్మ సమగ్రతను గాని, పరిపూర్ణతను గాని కదిలించలేవు. ఈ విధంగా రాధాకృష్ణ పండితులు ప్రాచ్య పాశ్చాత్య దృష్టులను కూడా సమన్వయపరచ గలిగారు.
ఇందువల్లనే భారత తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులు సానుభూతితోను, ఆర్ద్రతతోను చూడగలిగారు. ప్రపంచానికి సరిపోయే ఒక విశిష్ట తత్వశాస్త్రానికి పునాది వెయ్యగలిగారు. వీరు ప్రచారం చేసే ఆత్మతత్వ తాత్విక దృష్టి ప్రకారం, మూలసూత్రాల్లో అన్ని మతాలూ ఒకటే. అన్ని మతాల సారాంశం ఒకటే. ఎందుకంటే, మతమనేది ఒక సిద్ధాంతం కాదు. కొన్ని సూత్రాల సంపుటీకరణం కాదు.
- గోపీచంద్ ‘తత్వవేత్తలు’ నుంచి..






