06-02-2026 10:06:48 AM
చివ్వెంల: జాతీయ రహదారి ఎన్హెచ్–365కు అతి సమీపంలోనే దొంగలు రెచ్చిపోవడం చివ్వెంల మండలంలో భద్రతపై తీవ్ర సందేహాలు కలిగిస్తోంది. అక్కలదేవిగూడెం గ్రామ పరిధిలోని అమరగాని ఆంజనేయులు వ్యవసాయ భూమిలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లోని విలువైన పనిముట్లను గుర్తుతెలియని దొంగలు రాత్రి వేళ దొంగిలించారు. ఈ ఘటనలో రైతులకు అత్యంత అవసరమైన స్టార్టర్ పెట్టెలు, విద్యుత్ వైర్లు ఎత్తుకెళ్లడంతో సాగు పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. జాతీయ రహదారి పక్కనే ఈ తరహా దొంగతనాలు జరుగుతుండటం, వరుస ఘటనలపై చర్యలు లేకపోవడం రైతులు, గ్రామస్తుల్లో భయాందోళనను పెంచుతోంది. దొంగలు ఎవరో ఇప్పటికీ తేలకపోవడంతో, గ్రామంలో రాత్రి పహారా, పోలీస్ గస్తీ పెంచాలని, దొంగలను వెంటనే పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.