04-12-2025 01:05:41 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 3: కనీస పెన్షన్ను పెంచే ఆలోచన లేదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే స్పష్టం చేశారు. బుధవారం పార్లమెంట్ లో ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ క్లారిటీ ఇచ్చారు. ఉద్యోగులకు చెల్లించే వేతనాల్లో యజమాని ఇచ్చే 8.33 శాతం వాటాతో ఉద్యోగుల పెన్షన్ నిధికి నిధులు అందుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. ఏటా దీని ద్వారానే ఉద్యోగులకు పెన్షన్ అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
అయితే ప్రస్తుతం ఈ పెన్షన్ పథకం నిధి లోటులో ఉందని ఆమె తెలిపారు. దీంతో ప్రభుత్వం అదనపు నిధులు ఇవ్వాల్సి వస్తుందన్నారు. కాబట్టి కనీస పెన్షన్ పెంపు ఆలోచన చేయడం లేదని ఆమె పేర్కొన్నారు. దీంతో ఉదోయగుల ఆశలపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు జల్లింది. గత కొన్నాళ్లుగా ఉద్యోగుల భవిష్యనిధిలో చందాదారులుగా ఉన్న వారికి రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే కనీస పెన్షన్ ను కేంద్ర పెంచబోతున్నట్లు ప్రచారంలో ఉంది.
ఈపీఎస్ 95 పెన్షన్ పథకం కింద వీరికి ప్రస్తుతం చెల్లిస్తున్న కనీస మొత్తం వెయ్యి రూపాయల నుంచి రూ.7,500కు కేంద్రం పెంచుతుందేమోనని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతుల ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ సారైనా కేంద్రం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే దీనిపై ప్రకటన చేస్తుందని కూడా ఉద్యోగులు ఆశించారు. కానీ వారి ఆశలపై కేంద్రం నీళ్లు జల్లింది.