పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ కె.హరిత
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. శనివారం రెబ్బెన మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని డీఈవో లలితతో కలసి ఆకస్మికంగా సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, వెలుతురు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, వైద్య సిబ్బందిని నియమించాలని తెలిపారు. సీసీ కెమెరాల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాలలోకి అనుమతించకూడదని సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పరీక్షల ముఖ్య పర్యవేక్షకులు, శాఖ అధికారులు, ఇన్విజిలేటర్లు తదితరులు పాల్గొన్నారు.




