12-06-2025 01:51:19 AM
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): కాళేశ్వరంలాంటి ప్రాజెక్టును వేరే దేశాల్లో కడితే గొప్పగా సత్కరించి పురస్కారం ఇచ్చేవాళ్లని, అయితే అద్భుతం చేసిన కేసీఆర్కు కమిషన్లు నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు లభిస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నాలుగేళ్ల కాలంలో ఇలాంటి ప్రాజెక్టును పూర్తి చేసిన చరిత్ర లేదన్నారు.
నర్మదా, భాక్రానంగల్, నాగార్జునసాగర్లాంటి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి కట్టారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో వంద కాంపోనెంట్స్ ఉన్నాయని, రెండు పిల్లర్లలో పగుళ్లు వస్తే ఆ ప్రాజెక్టు మొత్తం వేస్ట్ అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్కు మంచిపేరు రావడం ఇష్టం లేక మేడిగడ్డపై లాఫూట్ కాంగ్రెస్ నాయకులే ఏదో చిల్లర పని చేసి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరయ్యేందుకు బీఆర్కే భవన్ వచ్చిన సందర్భంలో కేటీఆర్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. వరి ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్, హర్యానాను దాటిపోయేలా తెలంగాణను కోటి ఎకరాల మాగాణం చేసినందుకు కేసీఆర్కు నోటీసులు ఇస్తారా అని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రేవంత్రెడ్డికి క్యాబినెట్ అంటే అర్థం కాదని, క్యాబినెట్ ఎలా పనిచేస్తుందో తెలియదన్నారు. ఆయన ఆలోచనలు, అజెండా వేరని, రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాల కంటే రేవంత్కి రాక్షసానందం, పైశాచిక ఆనందమే ముఖ్యమని కేటీఆర్ మండిపడ్డారు.
రేవంత్ గురువునే తరిమేసిన చరిత్ర కేసీఆర్ది..
రేవంత్రెడ్డికి కేసీఆర్ గొప్పతనం అర్థం కాదని, రేవంత్ గురువునే ఇక్కడి నుంచి కరకట్టకు తరిమేసినోడు కేసీఆర్ అన్నారు. రేవంత్రెడ్డి తనకు పిల్లనిచ్చిన మామ దగ్గర రేవంత్ రెడ్డి ఓ ఐదు నిమిషాలు కూర్చుని కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటో తెలుసుకోవాలన్నారు. కాళేశ్వరం కాదు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కేసులు పెట్టినా 420 హామీలు, ఆరు గ్యారెంటీ అమలు నుంచి ప్రజల దృష్టిని మరల్చాలని ఎంత ప్రయత్నించినా మరలనియ్యమని కేటీఆర్ చెప్పారు.
ఆ పార్టీని బొందపెట్టే దాకా వెంటాడుతూనే ఉంటామన్నారు. ధర్మం, న్యాయమే గెలుస్తుందని, నిజాలు బయటికి వస్తాయన్నారు. అల్టిమేట్గా తెలంగాణ సాధించిన నాయకుడిగా, తెలంగాణను సస్యశ్యామలం చేసిన నేతగా కేసీఆర్ పేరు చరిత్రలో లిఖించబడుతుందన్నారు.
చిల్లర రాజకీయాలు పట్టించుకోం..
రేవంత్రెడ్డి చేస్తున్న ఈ చిల్లర రాజకీయాలను ప్రజలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. చిల్లర పనులు చేసి బ్యాగులు మోసి రేవంత్రెడ్డి జైల్లో పడ్డారు కాబట్టే తమ వాళ్లను కొంతమందిని జైల్లో పెట్టాలన్నదే ఆయన వికృతమైన ఆలోచన తప్ప ఇంకేమీ లేదన్నారు. కొన్ని రోజులు కాళేశ్వరం, కొన్ని రోజులు ఫోన్ ట్యాపింగ్ అని, కొన్ని రోజులు ఫార్ములా ఈ రేసింగ్ అని రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలన్నీ ప్రజల దృష్టిని మరలించడానికే అన్నారు.
ఇప్పటికే హరీశ్రావు ప్రజెంటేషన్తో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ఫీజులు ఎగిరిపోయాయని, ప్రజలకు కూడా మొత్తం వాస్తవాలు అర్థ్ధమయ్యాయన్నారు. కొత్తగా చెప్పడానికి, అడగడానికి కానీ వాస్తవంగా ఏమీ లేదని, సాంకేతికంగా పిలవాలి కాబట్టి పిలిచారన్నారు. ఇది కక్ష సాధింపు, రాజకీయ వేధింపు తప్ప ఇందులో ఏమీ లేదన్నారు. రేవంత్రెడ్డి కూలగొట్టడానికే వచ్చాడు తప్ప కట్టడానికి రాలేదని కేటీఆర్ విమర్శించారు. పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడం తప్ప ఇలాంటి ప్రాజెక్టులు కట్టడం ఆయనకు చేతకాదన్నారు.