11-06-2025 10:37:21 PM
పట్టపగలే హుషారుగా భూ కబ్జాలు..
గదులు నిర్మించి పేదలకు అమ్ముతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్న వైనం..
పరిశీలించి చర్యలు తీసుకుంటాం.. ఆర్ఐ రవికుమార్
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): ఓ వైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలను కాపాడాలని హైడ్రాను ప్రవేశపెట్టింది. కానీ కొందరు కబ్జా రాయుల్లు హైడ్రా అంటే ఏ మాత్రం భయం లేకుండా ప్రభుత్వ స్థలాల్లో రూములు కడుతూ పేదలకు అమ్ముతూ లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో ప్రభుత్వ భూములు రోజురోజుకు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం(Quthbullapur Constituency) దుండిగల్-గండిమైసమ్మ మండలం పరిధి భౌరంపేట్ లోని ఇందిరమ్మ కాలనీ పక్కన గల ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 576,577, 578 లో కొందరు వ్యక్తులు రూములు కడుతూ పేదలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
హైడ్రా అంటే ఏ మాత్రం భయం లేకుండా పట్టపగలే నిర్మాణాలు చేపడుతున్నా కూడా రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు.ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే నిర్మాణాల పట్ల మౌనం ఎందుకు వహిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ భూములు 15 సంవత్సరాల క్రితం పేదలకు ఇందిరమ్మ పట్టాలను పంపిణీ చేసింది.దీనిని అడ్డు పెట్టుకొని కొంతమంది వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని ఆధారంగా చేసుకొని నోటరీ చేసి ప్రభుత్వ స్థలాల్లో గదులు నిర్మించి పేదలకు అమ్మేస్తున్నారు.
ఒక్కో గది ధర 15 నుండి 20 లక్షలకు అమ్ముతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు ఆరు నెలల్లోగా ఇళ్ళు నిర్మించకపోతే పట్టాలు రద్దు అవుతాయి.కానీ కొంత మంది వ్యక్తులు వాటిని అడ్డు పెట్టుకొని ప్రభుత్వ స్థలాల్లో గదులు నిర్మిస్తూనే ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని, గదులు నిర్మించి అమ్మకాలకు పాల్పడుతున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని స్థానికులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం..ఆర్ఐ రవికుమార్
ఇందిరమ్మ కాలనీ పక్కన గల ప్రభుత్వ స్థలంలో గదుల నిర్మాణాలపై ఆర్ఐ రవికుమార్ ను వివరణ కోరగా ప్రభుత్వ భూముల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.