26-06-2024 12:05:00 AM
రాజా వేశ్యా యమశ్చాగ్నిః
చోరాః బాలక యాచకః
పరదుఃఖం నజానంతి
అష్టమో గ్రామ కంటకాః!
-చాణక్యనీతి 1717
“రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలకులు, యాచకులు, గ్రామకరణం... ఈ ఎనిమిది మందికీ ఇతరులు ఏ పరిస్థితులలో ఉన్నారనే ధ్యాస ఉండదు. ఎదుటివారి బాధలను అర్థం చేసుకోలేరు” అంటాడు చాణక్యుడు. రాజుకు సాధారణంగా కష్టాలు, దుఃఖాలు తెలియ వు. స్వయంగా దుఃఖం ఏమిటో అనుభవించని వారికి ఎదుటివారి కష్టం అర్థం కాదు కదా. అంతేకాదు, నిరంతరం రాచకార్యాలలో మునిగితేలే వారికి కొంత కఠినంగా ఉండవలసిన అవసరమూ ఉంటుంది. “రాజుల మనస్సు దారుణాఖండల శస్త్రతుల్యం, మాట మాత్రం నవ్య నవనీత సమానంగా ఉంటుంది” అన్నాడు నన్నయ. ఎదుటి వారి కష్టాలకు కరిగినట్లే కనిపించాలి కానీ, ఎప్పుడూ కరగిపోవద్దు. ఇతరుల సలహాలు తీసుకో వాలే కాని తన పద్ధతిలో తాను నడవాలి. అందరికీ స్నేహితునిగా నటించాలి కాని, గూఢచారిలా వ్యవహరించాలి. మిత్రులను, బంధుగణాన్ని చివరకు భార్యా పిల్లలను కూడా అతిగా నమ్మవద్దు. తమ ఆజ్ఞను ధిక్కరించిన వారు ఎవ్వరయినా ఏ పరిస్థితులలో ఉన్నా చివరకు తమ సంతానమైనా శిక్షిస్తారే కాని, ఎదుటివారి బాధలను దుఃఖాన్ని అర్థంచేసుకొని క్షమించడం జరగదు. రాజకీయాలలో నీతిని పాటించే వారు అరుదుగా ఉంటా రు. తమ భద్రత, తమ మేలు లక్ష్యంగా సాగే వారి కార్యాచరణలో శాసన ధిక్కారాన్ని ఏ పరిస్థితులలో కూడ సహించరు.
అదే యమధర్మం
వేశ్య వృత్తి విటులను ఆకర్షించడం. వారివద్ద ధనాన్ని పొందడం. ‘అయ్యో! వారి ఇల్లు నా వల్ల గుల్లవుతుందే’ అని బాధ పడుతూ కూర్చుంటే ఆమె వృత్తి సాగదు. కాబట్టి, డబ్బు సంపాదించడమే లక్ష్యంగా, ఎదుటివారి కష్టనష్టాలతో సంబంధం లేకుండా విటులను ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆర్జిస్తుంది. యమధర్మ రాజు కర్తవ్యం ... ఆయువు తీరిన జీవుల ప్రాణాలు హరించడమే. మనకు సంబంధించిన వారు ఏ వయసులో ఉన్నా మన ల్ని వీడి అనంత లోకాలకు వెళితే మనకు బాధయే. అయితే, మృతుల బంధువులు, స్నేహితులు దుఃఖిస్తున్నారని కరుణాయత్త చిత్తంతో కూర్చుంటే తన కర్తవ్య పాలనను యముడు చేయలేడు కాబట్టి, ఎదుటివారి బాధలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతాడు.
అలా చేయకపోతే పెరిగే జన సాంద్రతకు ఈ భూమండలమే కాదు, ఎన్ని భూమండలాలైనా సరిపోవు. ఆహార పానీయాదులకూ కష్టమవుతుంది. అయినా, పాత నీరు అలాగే ఉంటే కొత్తనీరు వచ్చేందుకు అవకాశం ఉండదు కదా. సర్వభ క్షకుడైన అగ్నికి కాల్చడమే లక్షణం. అన్నింటినీ దహించి వేసే అగ్నిశిఖలకు తర తమ భేదం లేదు. ఎవరి బాధ లు, కష్టాలను, దుఃఖాలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతుంది. చోరులు వృత్తి దోచుకోవడమే. ‘ఈ ఇంటి యజమాని కష్టాలలో ఉన్నాడు. ఇతని సంపదను దోచుకోవద్దని’ అనుకొంటూ, జాలి కనికరంతో ఉంటే తన పని నడవదు. అదను చూసి, ఆదమరచిన వేళ దోచుకోవడం అలవాటయిన చోరుడు ఇతరుల దుఃఖానికి స్పందించే సున్నితత్త్వాన్ని ప్రయత్న పూర్వకంగానైనా వదలివేస్తాడు.
చిన్నపిల్లలు తమకు కావలసిన దానిని సాధించుకునే క్రమంలో తామెక్కడ ఉన్నదీ, అడిగేందుకది సరైన సమయమా కాదా, ఎలా అడగాలి అనే విషయాలను పట్టించుకోరు. తల్లిదండ్రులు దుఃఖంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా తాము కోరిం ది జరిగేదాక హఠం చేస్తారు. అవకాశం ఉంటే గారాబంగా అడిగి సాధిస్తారు. లేదంటే ఏడ్చి, గోల చేసి, పంతం పట్టి, అలిగి, అల్లరి చేసి లేదా బ్లాక్ మెయిల్ చేసైనా సాధిస్తారు.
వారికి అందరూ సమానమే
ఈ క్రమంలో ఎవరి బాధలనూ వారు పట్టించుకోరు. యాచకులు ఎవ్వరినైనా యాచిస్తారు. తమ వృత్తిపరంగా ఎదుటివారు ఎవరు, ఏ పరిస్థితులలో ఉన్నారనే విషయం వారికి అవసరం లేదు. అందరి ముందు చేయి చాచడమే వాడికి తెలిసిన విద్య. ఇక చివరగా, గ్రామ కరణం. ఇద్దరి మధ్య విభేదా లు సృష్టించి వారినుండి వీరినుండి లబ్ధి పొందడమే వృత్తిగా కలిగి కరణీకం చేసే వ్యక్తులకు ఎవరైనా బాధ పడతారనే ఆలోచన ఉండదు. వీరికి మిత్రులు శత్రువులు అంటూ ప్రత్యేకంగా ఉండరు. తమ స్వార్థానికి ఎదుటివారిని ఎలా ఉపయోగించు కోవాలో నేరుస్తారు. వీరు అందరి వద్దా తలలో నాలుకలాగా చనువుగా వ్యవహరిస్తూ, అవకాశం రాగానే ఎదుటివారిని ముంచి వేసే ప్రయత్నం చేస్తారు. ఎదుటివారి బాధలలో తమ సంతోషాన్ని వెదు క్కునే ఇలాంటి వారిని ‘గ్రామ కంటకాః’ అని సంబోధిస్తాడు చాణక్యుడు.
ఇలా చాణక్యులు ఎదుటివారి బాధల ను, దుఃఖా న్ని పట్టించుకోని వాళ్లను గురించి చెప్పడంలో ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా మానవులు మంచికన్నా చెడుకే ఎక్కువగా స్పందిస్తారు. సింహం నోట్లో తలపెడితే ఏమవుతుందో తెలిస్తే దానికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తాం.