విద్యాభివృద్ధికి తల్లిదండ్రుల పాత్ర కీలకం
కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమో, తల్లిదండ్రుల పాత్ర కూడా అంతే కీలకమని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా గురువారం బిజినపల్లి మండలం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించిన సమావేశానికి ఆయన ఆకస్మికంగా హాజరయ్యారు.
విద్యార్థులు పాఠశాలలో నేర్చుకునే విద్యతో పాటు ఇంటి వద్ద తల్లిదండ్రుల ప్రోత్సాహం, పర్యవేక్షణ అవసరమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగ అభివృద్ధికి పాటు పడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం పెంపు, మధ్యలో చదువు మానేసే వారి సంఖ్య తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ చదువుకు అనుకూల వాతావరణం కల్పించాలని సూచించారు. సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






