calender_icon.png 20 June, 2025 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టార్స్ కంటే వీళ్లే పెద్ద సెలబ్రిటీలు అనిపించారు

20-06-2025 12:09:19 AM

సెవెన్ హిల్స్ బ్యానర్‌పై సెవెన్ హిల్స్ సతీశ్ నిర్మాతగా నవీన్‌కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘సోలోబాయ్’. ఈ చిత్రంలో బిగ్‌బాస్ ఫేమ్ గౌతంకృష్ణ హీరోగా నటిస్తుండగా పసుపులేటి రమ్య, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్కే మామ, భద్రం ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్‌కుమార్, రజిని వర్మ తదితరులు కీలక పాత్ర పోషించారు. జులై 4న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ను ఆపరేషన్ సిందూర్‌లో అమరుడైన జవాన్ మురళి నాయక్ తల్లిదండ్రుల చేతుల మీదగా లాంచ్ చేయించింది చిత్రబృందం.  ఈ సందర్భంగా మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ.. “ఉన్న ఒక్క కొడుకు దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించడం మాకు ఎంతో గౌరవంగా ఉంది. మా కొడుకు మాకు దూరమైనప్పటికీ గౌతమ్ లాంటి మరో కొడుకు మాకు దొరికాడు అనుకుంటాం. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాం” అన్నారు.

హీరో గౌతమ్‌కృష్ణ మాట్లాడుతూ.. “మధ్యతరగతి కుటుంబాలను ఆధారంగా చేసుకుని తీసిన చిత్రమిది. చిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకున్నాం. పెద్ద సెలబ్రిటీల కంటే ఈ కుటుంబీకులే పెద్దగా అనిపించారు. అందుకే వారిని ఆహ్వానించాం. నా ప్రతి సంపాదనలో సగం సమవర్తి అనే ట్రస్టుకు అందజేయాలని నిర్ణయించుకున్నా. రూ.లక్ష మురళి నాయక్ కుటుంబానికి అందజేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని తెలిపారు.

“సోలోబాయ్’ మధ్యతరగతి కుటుంబాలను ప్రతిబింబిస్తుంది” అని చిత్ర దర్శకుడు నవీన్‌కుమార్ తెలిపారు. చిత్ర నిర్మాత సెవెన్ హిల్స్ సతీశ్ మాట్లాడుతూ.. “ఒక సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పనిచేస్తారు. చిన్న సినిమాలకు రివ్యూలు రెండు రోజుల తర్వాత ఇస్తూ ఆ సినిమాలను బతికించాలని మీడియాను కోరుకుంటున్నా” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత దామోదర్ ప్రసాద్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్, దర్శకుడు యాట సత్యనారాయణ, సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్, మిగతా చిత్రబృందం పాల్గొన్నారు.