17-12-2025 01:16:49 AM
శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ఇందులో నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికారెడ్డి, బిందుమాధవి, రాధ్య, అదితి భావరాజు ఇతర ముఖ్యపాత్రల్ని పోషించారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించగా, మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు శివాజీ మీడియాతో ముచ్చటిస్తూ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
“దండోరా’లో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. మంచోడా.. చెడ్డోడా? అనేది ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులే నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఇందులో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తా. అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ప్రాధాన్యమున్న పాత్ర నాది. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకూ ప్రాధాన్యం ఉంటుంది.
ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇది పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన సినిమా. ఎంతో సహజంగా, అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. గొప్ప స్క్రీన్ప్లే ఉంటుంది.
‘కోర్ట్’లో మంగపతి పాత్రకు ఎంత స్పందన వచ్చిందో అంతే రెస్పాన్స్ ‘దండోరా’లోని పాత్రకూ వస్తుంది. ఎంతో అదృష్టం ఉంటే తప్ప.. ఇలాంటి పాత్రలు రావు. ఇందులో డిఫరెంట్ షేడ్స్ ఉన్న కారెక్టర్ లభించింది. ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే పాత్ర దొరికింది. అద్భుతమైన కంటెంట్తో ఎమోషనల్గా సాగే చిత్రమిది.
నా నుంచి ఇంకా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’లోనూ నటిస్తున్నా. ఆ సినిమా ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ఉంటుంది.