05-02-2026 12:00:00 AM
సూర్యాపేట (నల్లగొండ), ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బలిదానాలు చేసిన వారే జాతిపితలు అవుతారని, కేసీఆర్ జాతిపిత కాలేడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. నల్లగొండలో బుధవారం కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన ప్రచారంలో ఓ మీడియా ఛానల్తో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటుకు 1,100 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారని, వారే జాతిపితలు అవుతారని స్పష్టం చేశారు. ఉద్యమంలో పాల్గొన్నంత మాత్రాన కేసీఆర్, కోమటిరెడ్డి లాంటివాళ్లు జాతిపితలు కాలేరన్నారు.
తెలంగాణ కోసం పిల్లల ఆత్మహత్యలు, శ్రీకాంతాచారి బలిదానం చూసి, మంత్రి పదవిని వదిలి, సొంత పార్టీని, సోనియాగాంధీని ఎదిరించి, ప్రాణాలకు తెగించి 11 రోజులపాటు నల్లగొండ క్లాక్ టవర్ దగ్గర తాను దీక్ష చేశానని గుర్తు చేశారు. తెలంగాణ చరిత్రలో తన పేరు కూడా ఉన్నదని అయినా ఏనాడు తాను జాతిపితను అని చెప్పుకోలేదన్నారు. 1,100 మంది పిల్లల బలిదానాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చి. సోనియమ్మను తెలంగాణ ప్రజలంతా దేవత అంటే ఒప్పుకుంటారు కానీ కేసీఆర్, కోమటిరెడ్డిలను జాతిపితలంటే ఒప్పుకోరని పేర్కొన్నారు.