ఉప్పల్లో పాఠశాల యాజమాన్యానికి బెదిరింపులు.. కేసు నమోదు
ఉప్పల్, జూలై 19 (విజయక్రాంతి) : టీవీఎన్స్ స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుని పేరుతో ఉప్పల్ లో ఉన్న సెయింట్ మటి లాడ్స్ మోడల్ స్కూల్ లోకి వచ్చి స్కూల్ యజమానిని డబ్బులు డిమాండ్ చేసిన బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి తెలిపిన ప్రకారం.. ఎం నరేందర్ అనే వ్యక్తి స్కూల్ యజమాన్యం అనుమతి లేకుండా పాఠశాల ప్రాంగణంలోకి ప్రవేశించి, స్కూలుకు పర్మిషన్ లేదంటూ పాఠశాల యాజమాన్యాన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యాజమాన్యం నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పాఠశాలకు వ్యతిరేకంగా మండల విద్యాధికారికి ఫిర్యాదు చేయడంతో పాటు, అదే ఫిర్యాదును వాట్సాప్ స్టేటస్లో మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిస్తూ పాఠశాల ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రచారం చేసినట్లు ఆరోపించారు. ఈ ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన ఉప్పల్ పోలీసులు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది






