30-01-2026 08:57:33 PM
వివరాలు వెల్లడించిన డిసిపి సురేష్ కుమార్
మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన వరుస ఇండ్ల దొంగతనాల కేసులో ముగ్గురు నిందితులను, గోల్డ్ రిసీవర్ ను అరెస్టు చేశామని సిసిఎస్ అండ్ మేడిపల్లి పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి సురేష్ కుమార్ దొంగతనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించడం జరిగింది.
ఢిల్లీకి చెందిన మా దేవ్ ఝూ(ఎ1) పవన్ గుప్తా (ఎ2) కాన్పూర్ కు చెందిన మంగళ్ సింగ్ (ఎ3) లు బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడి 250 గ్రాముల బంగారం, 6 కిలోల వెండి, రెండు లక్షల నగదు దోచుకుని పోయారని తెలిపారు. పోలీసులు సాంకేతిక ఆధారాలు,సి సి టీవీ ఫుటేజ్ ఆధారంగా నేరాలకు పాల్పడుతున్న నిందితులను గుర్తించి అరెస్టు చేశామని, వీరితో పాటు దొంగ సొత్తు కొనుగోలు చేసిన బీహార్ కు చెందిన సీరామ్ సవ్ బీరేంద్ర (ఎ4) ను కూడా ట్రాన్సిట్ వారెంట్ పై తీసుకువచ్చి, ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించామని, మరో ఇద్దరి నిందితులను బీహార్ నుంచి తీసుకు వస్తున్నట్టు డిసిపి తెలిపారు.
నిందితులు గతంలో నల్లగొండ ,జనగాం పోలీస్ స్టేషన్ లో పలుచోరీల కేసుల్లో నిందితులుగా ఉన్నారని, నిందితుల నుంచి నాలుగు సెల్ ఫోన్లు, రెండు లక్షల నాలుగువేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ కేసును చేదించిన పోలీస్ సిబ్బందికి డిసిపి సురేష్ కుమార్ అభినందించి రివార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో క్రైమ్ డిసిపి నాగలక్ష్మి, సిఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.