మండలంలో మూడు ఫ్రీ ప్రైమరీ పాఠశాలలు మంజూరు
సుల్తానాబాద్ ఎంఈఓ రాజయ్య
సుల్తానాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో మూడు ప్రీ ప్రైమరీ పాఠశాలలను ప్రారంభించనున్నట్లు మండల విద్యాధికారి ఆరేపల్లి రాజయ్య గురువారం తెలిపారు. అలాగే ఎంపీపీ ఎస్ సుల్తానాబాద్, ఎంపీపీ ఎస్ అశోక్ నగర్ సుల్తానాబాద్, ఎం పి యు పి ఎస్ నారాయణరావుపల్లి పాఠశాలలలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులుస్వీకరిస్తున్నామని ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కు ( 10+2) ఇంటర్మీడియట్ సమాన విద్యార్హతలు కలిగి ఉండాలని, ప్రారంభ బాల్య విద్య ఈసీఈ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలియజేశారు.
ఆయా పోస్ట్ కు ఏడవ (7) వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో మొదట ఆ హాబిటేషన్ వారికి, అనంతరం ఆ గ్రామపంచాయతీ వారికి , అనంతరం ఆ మండలం లోని వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్యన వయస్సు ఉండాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈ బీసీ లకు 5 సంవత్సరాలు, మాజీ సైనికులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుందని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు విద్యార్హతల మరియు సంబంధిత ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ కాపీలతో సంబంధిత స్కూల్ కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద తేదీ 09 సాయంత్రం లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆరేపల్లి రాజయ్య తెలిపారు.






